జనసేన పార్టీకి మరో తలనొప్పి.. వెలుగు చూసిన ఎమ్మెల్యే అక్రమాలు..?
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని ప్రజలు కూటమి పార్టీలను నమ్మి పట్టం కట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అధికార పార్టీల ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి దందాలకు పాలడ్పుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీనిలో భాగంగానే టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఒక ఆడియో కాల్ రికార్డింగ్ ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆడియోలో దేవినేని ఉమా పోలవరం జనసేన శాసనసభ్యుడు చిర్రి బాలరాజును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే రూ.100 కోట్లు సంపాదించారని చెప్పడం సంచలనంగా మారాయి. ఆయన గొప్పతనం యూట్యూబ్లో ఇప్పుడే కనిపించింది. ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా?. పవన్ కళ్యాణ్ ఏమీ పట్టించుకోరా.. అంటూ దేవినేని ఉమా, కరాటం రాంబాబుతో మాట్లాడినట్లు రికార్డయింది.

ఇదిలా ఉండగా మరో జనసేన ఎమ్మెల్యే ఇసుక దందా వెలుగులోకి వచ్చింది. రాజానగరం నియోజకవర్గంలోని కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ కాలువ, పుష్కర కాలువ పనులు శరవేగంగా జరుగుతున్న వేళ, స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులు రోజువారీ వందల లారీలతో అడ్డగోలుగా ఇసుకని తరలిస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆగడాలు భరించలేకపోయిన స్థానిక ప్రజలు అర్థరాత్రి లారీలను అడ్డుకొని మట్టి మాఫియాపై తిరుగుబాటు చేయడం సంచలనం సృష్టించింది. ఈ వార్త రాత్రికి రాత్రే వైరల్గా మారింది.
అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఇటువంటి దందాలు రోజురోజుకు శృతి మించుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలువలు ఆక్రమించినా, నీటి ప్రవాహానికి అడ్డుపడినా సహించేది లేదని హెచ్చరించినప్పటికీ, ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే సారథ్యంలోనే ఈ అక్రమాలు జరుగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రోజుకు 100 లారీలకు పైగా ఇసుక తరలిస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదని కలవచర్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఇటీవల మట్టి లారీల వల్ల 108 అంబులెన్స్ ఆలస్యం కావడంతో ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువల పునాదులనే తవ్వి తరలించడం వల్ల గట్లు బలహీనపడి, భవిష్యత్తులో వరద ముప్పు తప్పదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే తామంతా ఏకమై తిరుగుబాటు చేశామని గ్రామస్తులు తెలిపారు.
ఈ ఇసుక మాఫియా ఆగడాలపై వార్తలు రావడంతో సంబంధిత వర్గాలు మౌనం దాల్చాయి. ఈ ఘటనపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలని ప్రజలు అంటున్నారు.అయితే ఇదింతా పవన్ కల్యాణ్కు చేరకుండానే మధ్యలోనే కొందరు వ్యక్తులు మ్యానేజ్ చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తన పార్టీలో ఇలాంటి ఘటలను సహించరని, ఆయనకు ఎమ్మెల్యేల నిర్వాకం తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటారని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications