గేర్ మార్చిన పవన్, పట్టు బిగిద్దాం- 40 శాతం వాటా మాదే..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ బలోపేతం కోసం జనసేన కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. పార్టీ ప్లీనరీ వేదికగా భవిష్యత్ ప్రణాళికలు ప్రకటించనుంది. ఇదే సమయంలో క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం కొత్త నిర్ణయాలకు సిద్దం అవుతోంది. ఇక.. నామినేటెడ్ పదవుల్లోనూ 30-40 శాతం దక్కేలా పార్టీ నాయకత్వం ఒత్తిడి తెస్తోంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదిగేలా స్కెచ్ సిద్దం చేస్తోంది.
ఇదే సరైన సమయం
జనసేన బలోపేతం పైన పవన్ ఫోకస్ చేసారు. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే పార్టీ మరింతగా ఎదిగేలా ప్లాన్స్ సిద్దం అవుతున్నాయి. సొంతంగా బలం పెంచుకోవటం కోసం కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. ఇందుకు పార్టీ ప్లీనరీ వేదిక కానుంది. మూడు రోజుల పాటు పిఠాపురం వేదికగా జరిగే పార్టీ ప్లీనరీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీ సభ్యత్వం, కమిటీల నియామకం తో పాటుగా భవిష్యత్ ప్రణాళికలు.. లక్ష్యాలను పవన్ ఆవిష్కరించనున్నారు. తాజా ఎన్నికల ద్వారా రాజకీయంగా దక్కిన పట్టు మరింత పెంచుకునేలా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.

సొంతంగా ఎదిగాల్సిందే
ఇదే సమయంలో ప్రస్తుతం ప్రకటిస్తున్న నామినేటెడ్ పదవుల్లో 30 నుంచి 40 శాతం వరకు పార్టీకి దక్కేలా ఒత్తిడి తేవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ అగ్రనేతలు ఈ మేరకు జిల్లాల నాయకులకు సూచనలు చేసారు. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు జనసేన కీలక నేతలు స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లాలని.. నామినేటెడ్ పోస్టుల్లో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు కేటాయించా లని కోరాలని సూచించారు. ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే నుంచి స్పందన సరిగ్గా లేకపోతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల పాటు రాష్ట్రాభివృద్ధి, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టామని.. ఇప్పుడు పార్టీ బలోపేతానికి అందరం కలిసి పని చేయాలని నిర్దేశించారు.
కేడర్ కు దిశా నిర్దేశం
సార్వత్రిక ఎన్నికలకు కేడర్ ఏ విధంగా పని చేసిందో.. పంచాయితీ ఎన్నికల కోసం అదే స్పూర్తి తో పని చేయాలని సూచించింది. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నాయకులకు, కేడర్కు గుర్తింపు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. గోదావరి, రాయలసీమ జిల్లాల నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ముందుగా కమిటీలు ఏర్పాటు చేసుకుని, తాము చెప్పిన విధంగా ఎమ్మెల్యేల వద్దకు వెళ్లాలని సూచించారు. అయినా, అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే నాయకత్వం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. దీని ద్వారా పార్టీ ప్లీనరీ నాటికే ఒక స్పష్టమైన ప్రణాళిక ఖరారు చేసి.. పిఠాపురం నుంచి కొత్త రోడ్ మ్యాప్ ప్రకటించేలా కసరత్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications