వ్యూహం మార్చిన పవన్ కల్యాణ్!
జనసేన పార్టీ వ్యూహం మార్చింది. నిన్నటివరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికార వైసీపీపై, ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనే పట్టుదలతో జనసేన ఉండగా, ఆ పార్టీని నిలవరించాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నారు. ఇరుపార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది.

నాదెండ్ల మనోహర్ వంతు..
పవన్ కల్యాణ్ తన దూకుడు తగ్గించి దాన్ని రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ అయిన నాదెండ్ల మనోహర్ కు అప్పగించారు. విజయనగరం జిల్లాలో వారం రోజులపాటు జిల్లావ్యాప్తంగా సమస్యలను గుర్తించి పార్టీ నేతలతో చర్చించి వాటిపై పోరాటం చేయబోతున్నారు. జగన్ సభలో మహిళల నల్ల చున్నీలు తీసి రమ్మనమనడాన్ని మనోహర్ తీవ్రంగా దుయ్యబట్టారు.

రౌడీసేన ఎలా అవుతుందో చెప్పాలంటూ సవాల్
జగన్ చరిత్రంతా ప్రజలకు తెలుసని, వైసీపీ విముక్త ఏపీ అనేదే తమ లక్ష్యమని ప్రకటించారు. పులివెందులలో పరదాలు కట్టుకొని పర్యటించే వ్యక్తి తమ పార్టీని విమర్శించే హక్కు లేదన్నారు. విజయనగరంలోని సమస్యలపై జిల్లావ్యాప్తంగా పోరాటం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామన్నారు.
వైఎస్ జగన్ నర్సాపురం సభలో మాట్లాడుతూ జనసేనను రౌడీసేన అని అభివర్ణించారు. దీనిపై నాదెండ్ల స్పందించారు. తమది ఏవిధంగా రౌడీసేన అవుతుందో ముఖ్యమంత్రి చెప్పాలని సవాల్ విసిరారు. అధికార పార్టీ చేస్తున్న అరాచకాలకు అదుపులేకుండా పోతోందని, ప్రజలు ఓడించే రోజుకూడా దగ్గరలోనే ఉందని మండిపడ్డారు.

ప్రభుత్వమే చేసిన ఘటన అది..
విశాఖపట్నం ఘటన ప్రభుత్వమే కావాలని చేసిన ఘటన అని స్పష్టం చేశారు. నరేంద్రమోడీ-పవన్ కల్యాణ్ మధ్య జరిగిన భేటీపై కూడా మనోహర్ స్పందించారు. ఏ ఒక్క వార్త నిజమైంది కాదని, ప్రచారం ఆపాలని, ప్రధానిని గౌరవిస్తాం కాబట్టి ఆయన చెప్పిన విషయాలకు ఎప్పటికీ బయటకు చెప్పమన్నారు. ఒకవైపు పవన్ కల్యాణ్, మరోవైపు నాదెండ్ల మనోహర్ ఇద్దరూ అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఒకరి తర్వాత మరొకరు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రానున్న రోజుల్లో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఖాయమనే విషయం స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications