పొత్తులపై చంద్రబాబు పిలుపు - జనసేన స్పందన : 8న అధికారికంగా - కొత్త మలుపు..!!
టీడీపీ అధినేత పిలుపుకు..జనసేన నుంచి సైతం సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. జనసేన నేత మనోహర్ సైతం చంద్రబాబు తరహాలోనే ప్రతిపక్షాలు కలవాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2024 ఎన్నికల లక్ష్యంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా చంద్రబాబు కొత్త పొత్తులకు ఆహ్వానం పలుకుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి రావాలని..ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా పిలుపునిచ్చారు.
పొత్తులపై క్లారిటీ కోసం చంద్రబాబు
గతంలోనూ ఆయన పొత్తుల పైన పలు సందర్భాల్లో ప్రత్యక్షం గా .. పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు. జగన్ ను ఓడించాలంటే అందరూ కలిసి రావాలని పరోక్షంగా సూచించారు. గతంలో కుప్పం పర్యటన సమయంలో చంద్రబాబు కు కార్యకర్తల నుంచి జనసేనతో పొత్తు అంశం పైన ప్రశ్నించారు. దీనికి స్పందనగా ఒన్ సైడ్ లవ్వు సరి కాదని..అటు నుంచి రావాలని వ్యాఖ్యానించారు. కానీ, దీనిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్ గా పేర్కొన్నారు. తరువాతి రోజుల్లో పార్టీ సమావేశం లో తాము ఎవరి పల్లకీ మోయటానికి సిద్దంగా లేమని తేల్చి చెప్పారు.
బీజేపీతో బంధం..తేల్చుకోలేకపోతున్న పవన్
కానీ, వైసీపీ నేతల నుంచి సీఎం వరకు పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడుగా వ్యాఖ్యానిస్తున్నారు. వారిద్దరూ కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ రాజకీయంగా ఫిక్స్ చేస్తున్నారు. ఇక, బీజేపీ నేతలు తాము జనసేనతో కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని..తమకు ఏ పార్టీ తోనూ పొత్తు ఉండదని స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో మరోసారి జిల్లాల పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాపోరాటానికి అందరూ కలిసి రావాలని ఆహ్వానిస్తూ..టీడీపీ నాయకత్వం వహిస్తుందని..అదే సమయంలో ఎటువంటి త్యాగాలకు అయినా సిద్దమంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.
మనోహర్ కీలక వ్యాఖ్యలు
అయితే, పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్..ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. దీని ద్వారా టీడీపీతో పొత్తు ఖాయమనే ప్రచారం సాగింది. కానీ, దీని పైన రెండు పార్టీల నుంచి ఆ తరువాత ఎటువంటి ప్రతిపాదనలు అధికారికంగా ముందుకు రాలేదు. ఈ రోజు తూర్పు గోదావరిలో చంద్రబాబు వ్యాఖ్యలు..ఇదే సమయంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందన పైన ఇప్పుడు చర్చ మొదలైంది. ఓట్లు చీలకూడదు.. జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారంటూ మనోహర్ మరోసారి చెప్పుకొచ్చారు.
ఉమ్మడి టార్గెట్ సీఎం జగన్ ఓటమి
ప్రభుత్వం నుంచి కలుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు అందరూ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. పరోక్షంగా చంద్రబాబు వ్యాఖ్యలను సమర్ధించారు. ఇక, ఈ నెల 8న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ..జనసేన ద్వితీయ శ్రేణి నేతలు రెండు పార్టీలు కలిసి పని చేయాలని కోరుకుంటున్నారనే చర్చ రెండు పార్టీల్లోనూ ఉంది. బీజేపీ కంటే టీడీపీతోనే రాజకీయంగా భవిష్యత్ బాగుంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
8న అధికారికంగా పవన్ స్పందించే ఛాన్స్
అదే సమయంలో చంద్రబాబు త్యాగాలకు సిద్దమని చెప్పటం ద్వారా..సీట్ల ఒప్పందాల్లోనూ ఇబ్బందులు ఉండవనే సంకేతాలు పంపినట్లుగా కనిపిస్తోంది. దీంతో..ఇక, దాదాపుగా అన్ని పార్టీలు ప్రజల ముందుకు వెళ్తున్న సమయంలో పొత్తుల పైన తేల్చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. ఈ నెల 8వ తేదీన పవన్ కళ్యాణ్ నేడు చంద్రబాబు చేసిన ప్రతిపాదన పైన ఏ రకంగా స్పందిస్తారు.. పొత్తుల అంశం పైన ఎటువంటి స్పష్టత ఇస్తారనేది చూడాలి.