పవన్ కళ్యాణ్ మోడీని ప్రశ్నిస్తారు కానీ జగన్ ఏంచేస్తారో చెప్పాలి: వైసీపీ నేతలను ఏకిపారేసిన జనసేన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన దీక్ష ఏపీలో దుమారం రేపింది. అప్పటి నుండి వైసీపీ నేతలు పవన్ ను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు . పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా వైసీపీ నేతల వ్యాఖ్యలకు జనసేన ఘాటుగా బదులిచ్చింది. ఒక్కొక్కరిని పేరుపేరునా ప్రస్తావించి మరీ వారి పనితీరును ఏకరువు పెట్టింది. పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించటం కాదు అసలు జగన్ ఏం చేస్తున్నట్టు చెప్పాలని డిమాండ్ చేసింది.

స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేసి ఏపీలో వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో పరిస్థితులను వైసిపి సర్కారు తీరును ఎండగట్టారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వైసీపీ నేతలు జనసేన పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

పవన్ ను టార్గెట్ చేసి వైసీపీ మంత్రులు, నేతల వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు . విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం పరిధిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పవన్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ తన పార్ట్నర్స్ బాగు కోసమే ఈ తరహా చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ దీక్షలు చేయడం మాని ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకునేలా చేయాలని వైసిపి నేతలు ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు మేకతోటి సుచరిత, కన్నబాబు, అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, గుడివాడ అమర్నాథ్ లు పవన్ పై మండిపడ్డారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై చేస్తున్న వ్యాఖ్యలకు జనసేన పార్టీ రివర్స్ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది.

వైసీపీ నేతలు తాడేపల్లి నుండి వచ్చే స్క్రిప్టు ప్రకారమే నడుచుకుంటారన్న పోతిన మహేష్
జనసేన నేత పోతిన వెంకట మహేష్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు దీక్ష చేయగానే వైసీపీ నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని 22 మంది ఎంపీలు పార్లమెంటులో ఉన్నప్పటికీ కనీసం ప్లకార్డులు పట్టుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలకు మాట్లాడే ధైర్యం లేదన్నారు. తాడేపల్లి నుండి వచ్చే స్క్రిప్టు ప్రకారమే నడుచుకుంటారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పోతిన మహేష్ . విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో మోడీ ని కలిసి ఫొటోలు దిగుతారని, ఢిల్లీలో రగ్గులు కప్పుకుని తిరగడం కాదు రాష్ట్ర సమస్యలపై స్పందించాలని మండిపడ్డారు.

విశాఖ ఉక్కు కోసం అఖిలపక్షం ఏర్పాటు చెయ్యాలని డిమాండ్
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పేర్కొన్న పోతిన మహేష్ దీనిపై సీఎం జగన్ అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో రెస్ట్ తీసుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి ని వైసిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు నిద్ర లేపాలని, జగన్ జపం చేయడం మానుకోవాలని హితవు పలికారు. అంతేకాదు పోరాట స్ఫూర్తి లేకపోతే రాష్ట్రానికి ద్రోహం చేసిన వారిగా మిగిలిపోతారు అంటూ నిప్పులు చెరిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఆయన అనేక సందర్భాలలో కార్మికుల పక్షాన తన గళాన్ని వినిపించారని పోతిన మహేష్ పేర్కొన్నారు.

అంబటి వంటి వారు కూడా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తారా?
ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ దీక్ష తర్వాత నోరుపారేసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్ చేసిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ దీక్ష ముగిసింది కానీ అంబటి రాంబాబు వంటి నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. అంబటి వంటి వారు కూడా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తారా? ప్రెస్ మీట్ లో అంబటి హావభావాలు చూసి జనాలు చీదరించుకుంటున్నారని స్పష్టం చేశారు .ట్విట్టర్ లో అడల్ట్ కంటెంట్ వున్నవాటినే అంబటి రాంబాబు ఫాలో అవుతున్నాడని, ఫోన్ల ద్వారా అన్ని రకాల పనులు చేయించుకునే ప్రావీణ్యం అంబటి రాంబాబుకు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి అంబటి ఇప్పటివరకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

హోం మంత్రి మేకతోటి సుచరితకు కౌంటర్
ఇక ఇదే సమయంలో హోం మంత్రి సుచరితకు కౌంటర్ ఇచ్చారు పోతిన మహేష్. దళిత మహిళ అని మంత్రి పదవిని కేటాయిస్తే అభివృద్ధిని గాలికొదిలేశారని అసహనం వ్యక్తం చేశారు. మీ జగనన్నతో మంచి పనులు ఎందుకు చేయించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. పవన్ ని ప్రశ్నించే వారు ముందుగా సీఎం జగన్ ను నిలదీయాలి అన్నారు పోతిన మహేష్. హోం శాఖకు సంబంధించిన అంశాలలో పెత్తనమంతా సజ్జల రామకృష్ణారెడ్డిదే అని పేర్కొన్న పోతిన మహేష్, హోంగార్డులను కూడా నియమించలేని హోంమంత్రి ముందు మీ శాఖలో పట్టు సాధించి అందరికీ మంచి చేయండి అంటూ హితవు పలికారు. నష్టపోయిన కష్టపడుతున్న రైతులు, మహిళలకు న్యాయం చేయాలని మీ జగనన్నను కోరండి అంటూ సూచించారు. వైసీపీ నేతలకు దమ్ముంటే విశాఖ ప్రైవేటీకరణను ఆపే విధంగా పోరాటం చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications