సింగపూర్ సహకారం: ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ రెడీ!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై సింగపూర్, జపాన్లకు చెందిన వివిధ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. స్మార్ట్ సిటీల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనపై అవి దృష్టి కేంద్రీకరించాయి. ఇందులో భాగంగా సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఈశ్వరన్ సోమవారం హైదరాబాద్కు రానున్నారు.
అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆయన సమావేశం కానున్నారు. ఈశ్వరన్తో పాటు సింగపూర్లోని కొన్ని సంస్థలకు చెందిన ప్రతినిధుల బృందం కూడా రానుంది. చంద్రబాబు బృందం ఇటీవల సింగపూర్, జపాన్లలో పర్యటించారు.
రాజధాని నిర్మాణం సహా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా పలు సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలతో చర్చలు జరిపారు. రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సింగపూర్ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
దానిని సింగపూర్ కేబినెట్ ఆమోదించిందంట. ఆ మాస్టర్ ప్లాన్పై చంద్రబాబుతో ఈశ్వరన్ చర్చించనున్నారు. ఇక, జపాన్ పర్యటనలో భాగంగా సుమిటోమో కంపెనీ ప్రతినిధులను కలిసిన చంద్రబాబు బృందం రాష్ట్రంలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి సహకరించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సుమిటోమో ప్రతినిధుల బృందం కూడా ఈనెల తొమ్మిదో తేదీన హైదరాబాద్కు రానుందని సమాచారం. ఈ బృందం ప్రకటిత రాజధాని ప్రదేశంలో పర్యటించే అవకాశముంది.
కేంద్రం సహకారం: పురంధేశ్వరి
ఏపీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ స హకారం అందిస్తుందని కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి బీజేపీ కా ర్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితులను అధిగమించి రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించేందుకు కావాల్సిన సహకారం అందించడానికి కేంద్రం ముందుకు వచ్చిందన్నారు.
ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు కూడా సహకారం అందిస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.