డ్రంకెన్ డ్రైవ్ టెస్టు: మీడియా, పోలీసులపై భగ్గుమన్న జయప్రద
హైదరాబాద్: డ్రంకెన్ డ్రైవ్ టెస్టు సందర్భంగా ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద మీడియాపై, పోలీసులపై భగ్గుమన్నారు. ఈ సంఘటన శనివారంనాడు రాత్రి హైదరాబాదులో జరిగింది. బ్రీత్ లైజర్ టెస్టు నిర్వహించడానికి పోలీసులు జయప్రద కారును ఆపినప్పుడు ఇది జరిగింది.
మాదాపూర్ నుంచి ఫిల్మ్ నగర్ వైపు జూబ్లీహిల్స్లోని రోడ్డు నెంబర్ 45లో వెళ్తున్న కారును పోలీసులు ఆపారు. యాంటీ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆ కారును ఆపారు. జయప్రదకు టెస్టు నిర్వహించారు. నెగెటివ్ ఫలితం వచ్చింది.
అయితే, అక్కడ వేచి చూస్తున్న మీడియా ఫొటోగ్రాఫర్లు కారులో ఉన్నది జయప్రద అని గుర్తించి మరోసారి టెస్టు చేయాల్సిందిగా పోలీసులను కోరారు. యాక్షన్ ఫొటో తీసుకోవాలనే ఉద్దేశంతో వారు ఆ విజ్ఞప్తి చేశారు. దాంతో జయప్రదకు చిర్రెత్తుకొచ్చి పోలీసులపై, మీడియా ప్రతినిధులపై మండిపడ్డారు.
హైదరాబాదులో పోలీసులు చాలా కచ్చితంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ సెలబ్రిటీలను కూడా వదలడం లేదు.