విభజన జరిగినా, రెచ్చగొట్టను: జెపి, పార్టీలపై నిప్పులు
హైదరాబాద్: విభజన జరిగినా తెలుగు వారంతా ఒక్కటేనని లోక్సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ సోమవారం అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద ఆయన మాట్లాడారు. రాజకీయ నాయకుల చేష్టల వల్ల ఇరు ప్రాంతాలలోని ప్రజల మధ్య భావోద్వేగాలు పెరుగుతున్నాయన్నారు.
పంతాలు, పట్టింపులకు పోయి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించవద్దని హెచ్చరించారు. 77 రూల్ కింద తాను సభాపతికి నోటీసులు ఇచ్చానని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని పార్టీలు సభలో నడుచుకుంటున్నాయని మండిపడ్డారు. ఓటు బ్యాంకు దృష్టితో ప్రజల మధ్య మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని రాజకీయ పార్టీలను కోరారు.
విభజన జరిగినా తెలుగు వారంతా ఒక్కటేనని, తెలుగు ప్రజల భవిష్యత్తును కాపాడవలసి ఉందన్నారు. మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్.. మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావ్ అన్న చందంగా తయారయిందన్నారు. రాష్ట్రమంతా వల్లకాడు అయినా ఫర్వాలేదు అధికారం కోసం ఏమైనా చేస్తామన్నట్లుగా ఉందని ఆరోపించారు. ప్రజలు దీనిని గుర్తించాలని సూచించారు.
ఇరు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు పైన తాము సూచించిన సవరణలను పరిగణలోకి తీసుకోవాలని జెపి కోరారు. వాదనలతో సమస్య పరిష్కారం కాదని, చర్చ జరగాలన్నారు. ఓట్లు, సీట్ల కోసం ప్రజల మధ్య భావోద్వేగం పెంచడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి నోటీసుపై...
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు పైన తాను స్పందించనని జెపి చెప్పారు. కిరణ్ ఇచ్చిన నోటీసు పైన సభాపతి నిర్ణయం తీసుకుంటారన్నారు. నోటీసు పైన తాను స్పందించి అగ్నికి ఆజ్యం పోయనన్నారు.