జయసుధ, దత్తాత్రేయ పలకరింపు: రేణుక, భట్టివర్గాల ఢీ
హైదరాబాద్/ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలలో అంతర్గతంగా, వేర్వేరు పార్టీలలో అసంతృప్త జ్వాలలు రాజుకుంటున్నాయి. మరికొన్ని చోట్ల వైరి పక్షాల అభ్యర్థులు ప్రచారంలో ఎదురుపడ్డప్పుడు పలకరించుకుంటున్నారు. సికింద్రాబాదు అసెంబ్లీకి కాంగ్రెసు పార్టీ తరఫున ప్రముఖ నటి జయసుధ, సికింద్రాబాద్ లోకసభకు బిజెపి తరఫున బండారు దత్తాత్రేయలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఆదివారం సికింద్రాబాదు నియోజకవర్గం పరిధిలోని వారాసిగూడలో జయసుధ, బండారు దత్తాత్రేయలు వేర్వేరుగా ప్రచారం చేశారు. ఈ సమయంలో వారు ఓ చోట తారాసపడ్డారు. దీంతో, ఇరువురు తమ తమ వాహనాల నుండి కిందకు దిగి పలకరించుకున్నారు. కాసేపు మాట్లాడుకొని అనంతరం ఎవరి దారిన వారు వెళ్లారు.

భట్టి, రేణుక వర్గాల బాహాబాహీ
మరోవైపు ఖమ్మం జిల్లా వైరాలో ఆదివారం జరిగిన వైరా అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ, కాంగ్రెస్ సమన్వయ సమావేశం రణరంగంగా మారింది. ఒకే పార్టీకి చెందిన భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి వర్గీయులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సమక్షంలో బాహాబాహీకి తలపడ్డారు. ఖమ్మం లోకసభకు పోటీ చేస్తున్న నారాయణ ఆదివారం వైరాలో సిపిఐ-కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి రేణుకా ముఖ్యఅనుచరుడు, వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సూరంపల్లి రామారావు వచ్చేందుకు ఇష్టపడలేదు. దీంతో నారాయణ ఆయన ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను సమావేశానికి తీసుకొచ్చారు. అప్పటికే అక్కడున్న భట్టి అనుచరుడు, జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ వర్గీయులకు, రామారావు వర్గీయులకు మాటామాటా పెరగడంతో రణరంగంగా మారింది. అక్కడే ఉన్న భట్టి తన అనుచరులు తప్పు చేశారంటూ బేషరుతుగా బహిరంగ క్షమాపణ చెప్పారు.












Click it and Unblock the Notifications