ఎవరో సినిమా ఆయనట: పవన్ కళ్యాణ్పై జేసీ, 'నిధుల'పై బాబుకు షాక్
న్యూఢిల్లీ: ఆయన ఎవరో సినిమా ఆయన అట... పవన్ కళ్యాణ్.. ఎలా ఒత్తిడి తేవాలో చెప్పవయ్యా.. అని అనంతపురం పార్లమెంటు సభ్యుడు, టిడిపి నేత జేసీ దివాకర్ రెడ్డి బుధవారం నాడు చురకలు అంటించారు. ప్రత్యేక హోదా ఎలా తీసుకు రావాలో పవన్ సూచన ఇవ్వాలని జేసీ అన్నారు.
ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ కూడా ఓ రాష్ట్రమని, ప్రధాని నరేంద్ర మోడీ అనుకుంటే ఏపీకి ఏదైనా చేయవచ్చునని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ అనుకుంటే ఏపీని కాదని కూడా అనుకోవచ్చునన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తొలుత కేబినెట్ ఆమోదం కావాలన్నారు. కేబినెట్ ఆమోదిస్తే పార్లమెంటులో దానికి తప్పకుండా ఆమోదం లభిస్తుందన్నారు. వంద శాతం హోదాకు పార్లమెంటులో ఆమోదం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
నిధులపై చంద్రబాబుతో విభేదించిన జేసీ
తమకు కేంద్రం నుంచి సరైన నిధులు రావడం లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర టిడిపి నేతలు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై జేసీ చంద్రబాబుకు ఓ రకంగా ఝలక్ ఇచ్చారు.
మాకు నిధులు వస్తున్నాయని, ఫర్వాలేదని, నిధులు రావడం లేదనటం సరికాదని జేసీ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రత్యేక హోదా ముఖ్యమని చెప్పారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఎలా తీసుకు రావాలో పవన్ కళ్యాణ్ సూచన చేస్తే బావుంటుందని జేసీ అన్నారు. కేంద్రం పైన ఒత్తిడి ఎలా తేవాలో సూచనలు చేయాలన్నారు. దేశంలో ఉన్ని రాష్ట్రాలు ఉన్నాయని, వాడిలో ఏపీ ఓ బోడి లింగం అన్నారు.