నెత్తి బాదుకున్నా..; దమ్ముంటే జగన్ 'రెడ్డి' అని ప్రకటించుకోవాలి: జేసీ
తాను రెడ్డి అని చెప్పుకుంటున్నా.. ఇతర కులాలు, మతాల్లో ఉన్నవారి పట్ల ఎలాంటి ద్వేషం లేదన్నారు జేసీ.
అనంతపురం: ఈమధ్య కాలంలో ఎక్కువగా వివాదస్పద వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలుస్తున్నారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ పై పదే పదే పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు.
తాజాగా అనంతపురం జిల్లా నల్లమాడలో జరిగిన 'ఎన్టీఆర్' విగ్రహావిష్కరణలో పాల్గొన్న జేసీ.. జగన్పై పలు విమర్శలు గుప్పించారు. సగర్వంగా రెడ్డి అని చెప్పుకునేది తానొక్కడినే అన్న జేసీ.. జగన్కు దమ్ముంటే అతను రెడ్డి అని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తాను రెడ్డి అని చెప్పుకుంటున్నా.. ఇతర కులాలు, మతాల్లో ఉన్నవారి పట్ల ఎలాంటి ద్వేషం లేదన్నారు జేసీ. కానీ రెడ్డి కులస్తులు ఎవరైనా తన సహాయం కోరి వస్తే.. కాదనకుండా సాయమందించే భావన తనలో ఉందని తెలిపారు.
ఆ ఒక్కదానిపై బాబుతో విభేదం: రెడ్లపై జెసి మరో సంచలన వ్యాఖ్య
ఇదే సమయంలో తన సామాజిక వర్గం మీద తానే విమర్శలు గుప్పించుకున్నారు జేసీ. రెడ్డి కులస్తు వల్లే రాష్ట్రం నాశనమైందని, ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చిపారేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు ముందు ఎంతమంది చేతులు పట్టుకున్నా.. నెత్తి బాదుకున్నా.. రెడ్లు ఎవరూ ఏపీ గురించి పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. కొందరు రెడ్ల వల్లే రాష్ట్రం చీలిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.