మోడీపై ఎంపి జేసి వివాదాస్పద వ్యాఖ్యలు:మెడ తెగ్గోసినా...ఆంధ్రకు న్యాయం చేయరు
అమరావతి:ప్రధాని మోడీ నుద్దేశించి అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ మెడ తెగ్గోసినా ఆయన నవ్యాంధ్రకు న్యాయం చేయరని ఎంపీ జేసీ నొక్కివక్కాణించారు. అసలు మోడీ ప్రధానిగా ఉండగా రాష్ట్రానికి ఏమీ చేయరని తేల్చేశారు. సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈవ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు 2019 ఎన్నికల్లోనూ కేంద్రంలో బీజేపీనే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని గానీ...మోదీనే మళ్లీ ప్రధాని అవుతారని గానీ చెప్పలేమని ఎంపీ చేసీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ కేంద్రంలో బిజెపినే అధికారంలోకి వచ్చినా నాయకత్వ మార్పు జరగవచ్చని జెసి అన్నారు. ఎపిలో చంద్రబాబు, తెలంగాణాలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రులు అవడం ఖాయమన్నారు.

రాష్ట్రానికి 19 వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాటలు పచ్చి అబద్ధమని జేసీ దివాకర్ రెడ్డి తేల్చేశారు. మరోవైపు వైసిపి నేత జగన్, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ లను కలపాలని ఢిల్లీలో కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నారని, కానీ అసాధ్యమని... ఎందుకంటే వీరిద్దరూ సీఎం పదవిని కోరుకుంటున్నారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను జెసి దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. పిచ్చోళ్లయితేనే అలా అధికారంలో ఉన్న పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి వెళ్తారని విశ్లేషించారు. ఎవరికైతే టీడీపీలో టికెట్లు రావో వారే చివరి నిమిషంలో వైసీపీకి వెళ్తారని, అది సహజమేనని వ్యాఖ్యానించారు. కేవలం మర్యాదపూర్వకంగా పలకరించినంతమాత్రాన టచ్ లో ఉన్నట్లు భావించకూడదని...పార్లమెంటులో తాను కూడా సాయిరెడ్డిని బాగున్నావా అని పలకరించానని...కలిసి కాఫీ కూడా తాగామని...అంత మాత్రాన టచ్లో ఉన్నట్లేనా?...ఆయన ఇటువంటి పిచ్చికూతలు మానుకోవాలని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications