బస్సులు నడుపుకుందామని, ఇంకోడు గేదెలు పెట్టుకోవడానికి..: ప్రభాకర చౌదరిపై జెసి తీవ్ర వ్యాఖ్యలు
అనంతపురం: అనంతపురం శాసనసభ్యుడు వైకుంఠం ప్రభాకర చౌదరిపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం నగరం ఎవడబ్బ సొత్తూ కాదు.. ఒకరి జాగీరూ కాదు.. అందరూ సెటిలర్సే.. బస్సు నడుపుకుందామని నేను వచ్చా.. ఇంకో ఆయన రెండు గేదెలు పెట్టుకుని జీవిద్దామని వచ్చినోడే.. నగరాభివృద్ధికి పాటుపడతా.. ఎవరైనా అడ్డుకోమని చూస్తా' ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మంగళవారం అనంతపురం నగరంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వచ్ఛ భారత్లో భాగంగా బుధవారం నుంచి అనంతపురం నగర నడిబొడ్డున ఉన్న మరువవంకను శుభ్రం చేయనున్నట్లు తెలిపారు. సొంత పార్టీలో ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య నగరాభివృద్ధి విషయంలో విభేదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి.
ప్రజాప్రతినిధిగా తాను అనంతపురం ప్రజల కోసం ఎంతో కొంత మంచి చేయాలనుకుంటున్నానన్నారు. అందులో భాగంగా దోమల నివారణ, పరిశుభ్రత, రోడ్ల విస్తరణ తదితర కార్యక్రమాలు చేపడుతున్న తనది కర్ర పెత్తనమా అని జెసి ప్రశ్నించారు.
ప్రజలు రోగాలతో కంపును భరిస్తూ ఇలాగే చావాల్సిందేనా.. అంటూ విరుచుకుపడ్డారు. అనంతపురం అభివృద్ధికి నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపామని త్వరలో ఆ నిధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వాటితో అనంత నగరాభివృద్ధి, పూడికతో పేరుకుపోయిన డ్రైనేజీల ప్రక్షాళన, భవిష్యత్తులో మురుగునీరు ఆగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.