'ఏంరాస్తారో!': చేతులు కలిపిన జగన్-జెసి, వైసిపిలో తిరుగుబాటు: సోమిరెడ్డి
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బుధవారం నాడు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. జగన్ పైన జెసి దివాకర్ రెడ్డి విరుచుకపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జగన్ పార్టీ కూడా జేసీ పైన మండిపడిన సందర్భాలున్నాయి.
అలాంటి జగన్, జేసీ దివాకర్ రెడ్డిలు ఈ రోజు ఎదురుపడ్డారు. ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకొని, చేయి కలిపారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంటుకు వచ్చిన వారిద్దరూ అనుకోకుండా ఎదురుపడడంతో మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు.
ఈ సమయంలో జేసీ దివాకర్ రెడ్డి సరదాగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ... 'జెసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని వార్తలు ఇస్తారా ఏమిటి' అని సరదాగా వ్యాఖ్యానించారు.

రాజ్నాథ్ సింగ్తో జగన్ భేటీ
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో వైసిపి అధినేత జగన్ బేటీ అయ్యారు. జగన్ రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఈ రోజు (బుధవారం) రాజ్నాథ్ సింగ్ను కలిశారు. భేటీ అనంతరం జగన్ మాట్లాడుతూ... నిన్న రాష్ట్రపతి వద్ద ప్రస్తావించిన అంశాలనే రాజ్నాథ్ వద్ద ప్రస్తావించానని చెప్పారు.
మంగళవారం రాష్ట్రపతితో భేటీ అయిన జగన్.. వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలయ్యేలా చూడాలని కోరారు.
జగన్పై తిరుగుబాటు మొదలు: సోమిరెడ్డి
వైసిపి అధినేత జగన్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు మొదలైందని టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మొన్న ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్పిన జగన్, ఈ రోజు తాను అలా అనలేదని చెప్పడం విడ్డూరమన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ప్రారంభమైందని, దానిని జగన్ కూడా ఆపలేరన్నారు. కేసుల అంశం పైనే జగన్ ఢిల్లీకి వెళ్లారని ధ్వజమెత్తారు. 2019 నాటికి ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండదని చెప్పారు. జగన్ పార్టీ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి రావడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications