''పెద్దాయన'' తిరిగొచ్చాడు.. మలుపు తిరగనున్న రాజకీయం!!
తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డి వారం రోజుల క్రితం ప్రకటించారు. అందుకనుగుణంగా తాడిపత్రి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. తన ముఖ్యమైన అనుచరుల ఇంటికి వెళుతూ అందరినీ పలకరిస్తున్నారు. నియోజకవర్గంలో పరిచయం ఉన్న ప్రతి ఇంటికి ఆయన కలియతిరుగుతున్నారు. ప్రజలంతా పెద్దాయన మళ్లీ తిరిగొచ్చాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. జేసీ పర్యటనపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి వైదొలగిన జేసీ
గత ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు జేసీ ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూనే వచ్చారు. తన బాధ్యతలను కుమారుడు పవన్కు అప్పజెప్పారు. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్రెడ్డి మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు.
తాడిపత్రి పురపాలక సంఘం చైర్మన్గా ఉన్నారు. జేసీ దివాకర్రెడ్డి మాత్రం అప్పుడప్పడు కేంద్ర, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పడు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన పోటీచేస్తారా? లేదంటే ఆయన కుమారుడే తిరిగి పోటీచేస్తారా? అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

గ్రామాల్లో పర్యటన
ఆయన గ్రామాల్లో పర్యటిస్తున్నారుకానీ ఇంతవరకు మీడియ ముందుకు రాలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ లో ఉన్న జేసీ కుటుంబం తర్వాత టీడీపీలో చేరింది. మనసులో ఎటువంటి విషయాన్ని ఉంచుకోకుండా నిక్కచ్చిగా మాట్లాడటమే దివాకర్ రెడ్డి బలం.. బలహీనత. దీనివల్ల పలుమార్లు సమస్యలు ఎదురైనప్పటికీ వెనకడుగు వేయలేదు.

తాడిపత్రిలో భయానక పరిస్థితులు
స్వాతంత్ర్య దినోత్సవం రోజు తాడిపత్రిలో దుండగులు ఇద్దరు మహిళలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. వారిని పరామర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో భయానక పరిస్థితులున్నాయని, పోలీసులు తమపై ప్రతాపం చూపించడం మాని నిందితులను పట్టుకోవాలని కోరారు. గాయపడ్డ మహిళలకు మెరుగైన వైద్యం అందిస్తానని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications