ఆ విషయంలో చంద్రబాబుది అత్యాశే..!, ఈ నిజం ఇప్పుడెందుకు చెబుతున్నానంటే.. : జేసీ
అనంతపురం : పార్టీ ఆదేశాల మేరకే మాట్లాడేవారు కొందరైతే.. పరిధులను సైతం పక్కకునెట్టి తమకు నచ్చిన అభిప్రాయం వెల్లడించే నేతలు మరింకొందరు. అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రెండో కోవకు చెందినవారు. తనదైన ఛమత్కారాలతో పాటు.. అధిష్టానానికి అనుకూలమా..? ప్రతికూలమా..? అన్న కట్టుబాట్లకు ఆయన కొన్నిసార్లు అతీతంగానే వ్యవహరిస్తారు.
తాజాగా అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో సీఎం చంద్రబాబు హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. జిల్లా పర్యటనలో భాగంగా ఇదే విషయాన్ని ప్రస్తావించిన జేసీ దివాకర్ రెడ్డి.. రుణమాఫీ హామి చంద్రబాబు అత్యాశకు నిదర్శనం అన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు.
'ఒకే దఫా రైతులందరికీ కనీసం రూ.50 వేలు రుణమాఫీ గనుక చేసుంటే.. ఈపాటికి చంద్రబాబును రైతులంతా నెత్తికెక్కించుకునేవారని, అనవసర అత్యాశకు పోయి చంద్రబాబు రుణమాఫీ హామి ఇచ్చారని' విమర్శించారు. కాగా, ఈ నెల చివరి వారం వరకు రుణమాఫీ పూర్తవుతుందన్న ప్రభుత్వ హామిని గుర్తు చేస్తూ.. ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టు రుణాలు మాఫీ కాకపోతే నియోజకవర్గ ఎమ్మెల్యేలను నిలదీయండి అంటూ సూచించారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, అందుకే నిర్భయంగా నిజాలు చెబుతున్నానని ప్రకటించారు. అంతేకాదు, తాను సీఎం చంద్రబాబును పొగిడే రకం కాదని చెప్పిన ఆయన, చంద్రబాబును పొగిడితే నాకేమైనా మంత్రి పదవి వస్తుందా..? అంటూ జనానికి ఎదురు ప్రశ్న వేశారు.
కాగా.. జేసీ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మరో పార్టీ ఎమ్యెల్యే జితేంద్రగౌడ్ కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఏదైమైనా పార్టీలకు ఫక్తు విధేయులుగా వ్యవహరించేవాళ్లు కొందరైతే, విబేధించడానికి కూడా వెనకాడని జేసీ లాంటి నేతలు మరికొందరు.