వైసీపీలోకి జేసీ వారసుడు - సీమలో మారుతున్న లెక్కలు..!?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2029 ఎన్నికలు లక్ష్యంగా పార్టీ లు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కొందరు ముఖ్య నేతలు వచ్చే ఎన్నికల్లో సీట్ల పైన ఆశ పెట్టుకున్నారు. ఇక.. 2024 ఎన్నికల్లో అనూహ్య ఓటమి చవి చూసిన జగన్.. ఇప్పుడు తన రూటు మార్చారు. ప్రతీ సీటు పైన ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో భాగంగా టీడీపీకి బలమైన నేతలుగా ఉన్న వారి పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో జేసీ వారసుడు వైసీపీలోకి ఎంట్రీ పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది.
అనంతపురం జిల్లాలో కొత్త రాజకీయాలు కనిపిస్తున్నాయి. జేసీ దివాక్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో పవన్ రెడ్డి టీడీపీ నుంచి అనంతపురం ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి తలారి రంగయ్య చేతిలో పవన్ ఓడిపోయారు. ఇక, 2024 ఎన్నికల్లో టీడీపీ జేసీ కుటుంబానికి ఒక సీటు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. ఫలితంగా జేసీ ప్రభాక్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి సీటు కేటాయించారు. కాగా, అస్మిత్ గెలుపొందారు. ఇక.. పవన్ పూర్తిగా వ్యాపారాలకే పరిమితం అయ్యారు. పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని తాను కోరుకుంటున్నట్లు జేసీ కుటుంబం పదే పదే చెబుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ జేసీ కుటుంబానికి టీడీపీలో ఒక సీటు మాత్రమే దక్కే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

ఈ సమయంలో పవన్ రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. జగన్ తో చిన్నప్పటి నుంచి పవన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా విభేదించినా.. ఇప్పుడు మాత్రం జేసీ కుటుంబం నుంచి జగన్ పైన విమర్శల జోరు తగ్గింది. కొంత కాలం క్రితమే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా పని చేసిన శైలజానాధ్ వైసీపీలో చేరే సమయంలో పవన్ రెడ్డిని కలిసారు. తాను వైసీపీలో చేరుతున్న అంశాన్ని చర్చించారు.

ఆ సమయంలోనే పవన్ వైసీపీలో చేరుతున్నారనే చర్చ జరిగినా.. ఆయన ఖండించారు. కాగా.. ఇప్పుడు తిరిగి అదే చర్చ మొదలైంది. పవన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు నిజంగానే సిద్దమయ్యారా... జేసీ కుటుంబంతో రాజకీయంగా పోరాటం చేస్తున్న వైసీపీ నేతలు ఇందుకు మద్దతిస్తారా అనేది కీలకంగా మారుతోంది. అయితే, ప్రచారం సాగుతున్నట్లుగా పవన్ వైసీపీలోకి వచ్చేందుకు ముందుకు వస్తే.. జగన్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. చివరకు జేసీ పవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications