చంద్రబాబు అవసరంలేదు, రఘువీరా హరిశ్చంద్రుడా: 'లంచం'పై జెసి కౌంటర్
హైదరాబాద్/అనంతపురం: తాను చేసిన లంచం తీసుకుంటానన్న వ్యాఖ్యల పైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఒక ప్రజా ప్రతినిధిగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష బలంగా ఉందని, కానీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, దీంతో ఇకపై తాను కూడా లంచాలు తీసుకుంటానని, వాటితోనే తన నియోజకవర్గాన్ని (తాడిపత్రి) అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.
దీనిపై రఘువీరా రెడ్డి మాట్లాడుతూ... జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై సిఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనపై జెసి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. లంచం విషయంలో సీఎం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రఘువీరా రెడ్డి ఏం సత్య హరిశ్చంద్రుడేం కాదన్నారు.
రఘువీరా రెడ్డి తన రాజకీయ జీవితంలో పైసా లంచం తీసుకోలేదా అని ప్రశ్నించారు. రఘువీరా కుటుంబ సభ్యులతో నీలకంఠాపురం వచ్చి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మృతదేహం ఉండగానే రఘువీరా రెడ్డి శవ రాజకీయాలు చేశారన్నారు. తమ కుటుంబానిది ఓటమి ఎరుగని చరిత్ర అన్నారు. ఓటమి భయంతో నియోజకవర్గాలు మారిన చరిత్ర వారిదని ఎద్దేవా చేశారు. రఘూవీరా తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
రఘువీరా అరెస్ట్
బీహార్లో ఎన్డీయే కూటమి ఓటమికి ఏపీ కాంగ్రెస్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సికింద్రాబాదులో పాట్నా ఎక్స్ప్రెస్ రైలు వద్ద వారు ఆదివారం ఉదయం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
అయితే, వారికి అనుమతి లేదని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో, కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి నేతృత్వంలోని నాయకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో వినూత్న ప్రచారం మొదలు పెట్టారు.
పాట్నా ఎక్స్ప్రెస్ వద్దకు చేరుకున్న నేతలు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని విమర్శిస్తూ ఆ పార్టీని నమ్మితే నట్టేట మునగడం ఖాయమని రైల్లోని ప్రయాణికులకు కరపత్రాలను పంచారు.
మోడీ హఠావో, దేశ్ కో బచావో... అంటూ నినాదాలు చేశారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిన ప్రధాని మోడీ, మట్టి-నీరు చేతిలో పెట్టారన్నారు. బిజెపికి ఓట్లు వేయవద్దని రైల్లోని బీహారీలకు సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తదితర మహాకూటమిలో భాగంగా బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. రఘువీరా, ఇతర నేతల ప్రచారాన్ని అడ్డుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.