ఆంధ్రావాడిననే అరెస్ట్ చేశారు, అది నా ప్యాషన్: జేసీ ప్రభాకర్ రెడ్డి
హైదరాబాద్: తాను ఆంధ్రావాడిని కాబట్టే అరెస్ట్ చేశారని ఏపీ తెలుగుదేశం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీఏ ఆఫీసు వద్దకు చేరుకున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. శ్రీనివాస్ గౌడ్, జేసీ ప్రభాకర్ రెడ్డి.. ట్రావెల్స్ అవకతవకల విషయంలో సవాళ్లు విసురుకుని మంగళవారం ఉదయం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్దకు చేరుకున్నారు.
ఆర్టీఏ ఆఫీసు వద్దకు చేరుకున్న జేసీని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడారు. తనకు బస్సులు నడపడం అంటే ప్యాషన్ అని అన్నారు. తన తండ్రి కూడా బస్సులు నడిపించేవారని చెప్పారు.
ఇక్కడి ప్రైవేట్ ఆపరేటర్ల కోసం శ్రీనివాస్ గౌడ్ తనకు నీతులు చెబుతున్నారని అన్నారు. తాను కూడా ప్రైవేట్ ఆపరేటర్లతో బాగానే ఉంటానని తెలిపారు. తాము 44బస్సులు నడుపుతున్నామని, తమ బస్సులకు అన్ని అనుమతులున్నాయని చెప్పారు.
ట్రావెల్స్ దుమారం: జేసీ సవాల్తో ఆర్టీఏకు శ్రీనివాస్ గౌడ్, జేసీ అరెస్ట్
ఆర్టీఏ ఆఫీసుకు చర్చించేందుకు వచ్చిన తనను మాత్రమే అరెస్ట్ చేసి, శ్రీనివాస్ గౌడ్ ను ఎలా వదిలేస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. శ్రీనివాస్ గౌడ్ కు బస్సుల వ్యాపారం గురించి ఏం తెలుసని నిలదీశారు. తాను తప్పు చేసినట్లు చూపితే.. తన మొత్తం బస్సులను నిలిపివేస్తామని ఆయన సవాల్ విసిరారు.
శ్రీనివాస్ గౌడ్.. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ గురించి మాట్లాడితే తనకేం అభ్యంతరం లేదని అన్నారు. తాను ఒకరి బస్సులు పట్టించేంత చెడ్డవాడ్ని కాదని అన్నారు. సునీల్ కు 120 బస్సులున్నాయని, తనకు 44బస్సులున్నాయని, ఇద్దరికీ అనుమతులున్నాయని చెప్పారు. కావాలంటే తనిఖీ చేసుకోవచ్చని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.