బాలయ్య, అశోక్ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి: టీడీపీ నేతకు చెంపదెబ్బలు, క్షమాపణలూ కోరారు
అనంతపురం: కార్యకర్తలపై చేయి చేసుకునే నేతల సంఖ్య తెలుగుదేశం పార్టీలో పెరిగిపోతోంది. ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ అభిమానిపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. అది మరువక ముందే మరో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఓ మహిళా కార్యకర్తపై చేయి చేసుకోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
భావోద్వేగానికి గురైన జేసీ ప్రభాకర్ రెడ్డి..
తాజాగా, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఆ జాబితాలో చేరిపోయారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంయమనం కోల్పోయరు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటడి పెట్టుకున్న భావోద్వేగానికి గురయ్యారు. ఇటువైపు వాహనాలతో వెళ్లకూడదని, అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
టీడీపీ నేతకు జేసీ ప్రభాకర్ రెడ్డి చెంప దెబ్బలు
అయితే, జేసీకి సర్దిచెప్పేందుకు అక్కడేవున్న ఆయన అనుచరుడు, టీడీపీ నేత రఘు ప్రయత్నించారు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. సంయమనం కోల్పోయి రఘుపై చేయి చేసుకున్నారు. రెండుమూడు సార్లు చెంప దెబ్బ కొట్టారు. అంతేగాక, దూషించారు. అయితే, రఘు మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏ మాత్రం ఎదురు చెప్పకపోవడం గమనార్హం. ఆ తర్వాత కొంతసేపటికి తేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. రఘును క్షమించాలని కోరారు. దీంతో అక్కడ వాతావరణం కొంత కుదుటపడినట్లయింది.
జేసీ టార్గెట్.. తాడిపత్రి మున్సిపాలిటీ
అనంతపురం తాడిపత్రిలో మరోసారి టీడీపీ సత్తా చాటాలని చూస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. 24వ వార్డు నుంచి టీడీపీ తరపున కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందని, తాము గెలిస్తే మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామంటూ ప్రచారంలో ప్రజలకు హామీ ఇస్తున్నారు.
ఇక అధికార వైసీపీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తమ పార్టీ గెలుపుకోసం శాయశక్తులా శ్రమిస్తున్నారు. టీడీపీకి చెక్ పెట్టేందుకు ఇప్పటికే వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి.. పెద్దరెడ్డి వ్యూహప్రతివ్యూహాలతో తాడిపత్రి రాజకీయాలు మరింత వేడెక్కాయి.