చంద్రబాబుపై జెసి ప్రశంసలు: సీమ ప్రజలపై బాలకృష్ణ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ ఎంపి జెసి దివాకర్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన శనివారం ధర్మవరంలో నిర్వహించిన మినీ మహానాడులో పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబునాయుడు నిర్ణయాలకు అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. ప్రభుత్వ పథకాల్లో కొన్నింటిని తొలగించాలని అన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం అడగడం సరికాదని చెప్పారు.
చంద్రబాబునాయుడు రాజకీయాల్లో భిన్నమైన వ్యక్తి అని అన్నారు. రుణమాఫీ తలకు మించిన భారమని చంద్రబాబుతో స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు.
సీమ ప్రజలు ఉత్తములు: బాలకృష్ణ
రాయలసీమ ప్రజలు ఉత్తములని టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఇక్కడి ప్రజలు ముక్కుసూటిగా మాట్లాడతారని చెప్పారు. ధర్మవరంలో శనివారం నిర్వహించిన మినీ మహానాడులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్థంగా ఉన్న స్థితిలో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి ప్రజలను ఆదుకున్నారని చెప్పారు. అనంతపురంలో రక్తపాతం తగ్గించే చర్యలు తీసుకున్నారని బాలకృష్ణ అన్నారు.