సంపద కొల్లగొడుతున్నారు: కెసిఆర్పై రేవంత్, జీవన్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. సామాజికవర్గ ముసుగులో బెదిరింపులకు పాల్పడుతూ కెసిఆర్ కుటుంబం పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. తెలంగాణ వారసత్వ సంపదను కెసిఆర్ కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
దోచుకోవడానికే టిఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మీడియా వ్యవస్థను లోబర్చుకుని పబ్బం గడుపుకోవడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ వేసుకున్న సెంటిమెంట్ ముసుగు తొలగిపోయిందని, ఇకపై ఆ పార్టీకి కష్టకాలమేనని చెప్పారు.

తమను ఎంత తిట్టినా పట్టించుకోమని చెప్పిన రేవంత్ రెడ్డి.. ప్రజల ఆస్తులను కాపాడడానికి పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతలు టిఆర్ఎస్ దోపిడీపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.
కెసిఆర్ వల్లే కరెంటు కష్టాలు: జీవన్
తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి సిఎం కెసిఆరే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ 54శాతం విద్యుత్ను విభజన చట్టంలో తెలంగాణకు కేటాయించిందని ఆయన తెలిపారు. 54శాతం విద్యుత్ను పొందలేకపోవడం కెసిఆర్ చేస్తున్న ద్రోహమని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి విద్యుత్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలకు కెసిఆర్ బాధ్యత వహించాలన్నారు.












Click it and Unblock the Notifications