జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ ఇక లేరు
న్యూఢిల్లీ: ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ కన్నుమూశారు. హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఆయన సతీమణి కాంతం ఇదివరకే కన్నుమూశారు.
తీన్మూర్తి భవన్లో జరిగిన కార్యక్రమంలో సరోద్ వాయిద్య కళాకారుడు ఉస్తాద్ అమ్జాద్ అలీ ఖాన్ చేతుల మీదుగా రావూరి భరద్వాజకు ఇటీవలే జ్ఞానపీఠ్ అవార్డును స్వీకరించారు. 2012వ సంవత్సరానికి గాను రావూరి భరద్వాజ దేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తెలుగు సాహిత్యకారుల్లో రావూరి భరద్వాజ మూడోవారు. విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణ రెడ్డి ఇది వరకు ఈ అవార్డును పొందారు.
రావూరి భరద్వాజ కృష్ణాజిల్లా మొగులూరు గ్రామంలో 1927లో జన్మించారు. ఆయన ఏడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 17వ ఏటి నుంచే రచనలు చేయడం ప్రారంభించారు. 1946లో నెల్లూరులో యువ సమ్మేళనానికి హాజరైన భరద్వాజ జమీన్ రైతు అనే వార పత్రికలో చేరారు. తర్వాత పలు మాసపత్రికల్లో పనిచేసిన భరద్వాజ ఆకాశవాణికి కూడా రచనలు చేశారు. ఆయన రచించిన విమల అనే కథ 1946లో ప్రచురితమైంది. ఆయన రచనల్లో జీవనసమరం, కాదంబరి పేరెన్నిక గన్నవి.
అనంతరం 172 రచనలు చేసిన భరద్వాజ కవితలు, పద్యాలు, కథల్లో తనదైన శైలిని కనబర్చారు. భరద్వాజ రాసిన పంచ మహా కావ్యాలు ఈ శతాబ్దపు గొప్ప రచయితగా పేరు తెచ్చాయి. భరద్వాజ రెండుసార్లు రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డును, కేంద్రీయ సాహిత్య అకాడెమీ అవార్డును, గోపీచంద్ అ వార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, భారతీయ భాషాపరిషత్ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారంతో పాటు మిక్కిలి అ వార్డులు, పురస్కారాలు అందుకున్నారు. జెఎన్టిలు 1980లో, నాగార్జున విశ్వవిద్యాలయం 1977లో గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశాయి.
ఫొటో: జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నప్పటి చిత్రం