నిరుద్యోగులకు టోకరా;రూ.కోటికి పైగా వసూలు;నిందితులు మామాఅల్లుళ్లు...ప్రభుత్వ ఉద్యోగులు కూడా
విశాఖపట్టణం: ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నిరుద్యోగుల నుంచి రూ.కోటి కి పైగా వసూళ్లు చేసిన మామ అల్లుళ్లపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులైన మామాఅల్లుళ్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులను మోసగించిన నిందితులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం.
అయితే నిరుద్యోగులకు కేవచెప్పడమే కాకుండా నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ లను కూడా నిందితులు అందచేయడం గమనార్హం. ఈ కేసులో నిందితులకు మరికొంతమంది ఉద్యోగులు కూడా సహకరించారని, వారి మీద కూడా కేసులు నమోదు చెయ్యాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.
వీళ్లే మోసగాళ్లు...ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు...
వేపగుంటకు చెందిన తెడ్లపు రామారావు విశాఖపట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో టెక్నీషియన్గా పని చేస్తున్నారు. అతని అల్లుడు విశాఖకే చెందిన శివకుమార్ హైదరాబాద్లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్సు (ఎన్ఎఫ్సీ)లో ఆఫీసర్ గా పని చేస్తున్నారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి కూడా అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు తప్పు దోవ పట్టారు.
ఉద్యోగాలిప్పిస్తామని...కోటి దాకా వసూలు...
పెద్ద మొత్తంలో డబ్బు సంపాదన కోసం వీరు మోసానికి తెరతీశారు. ఎన్ఎఫ్సీలో ఉద్యోగాలు ఉన్నాయని, డబ్బులు కడితే పనవుతుందని చెప్పి పలువురు నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ. 2లక్షల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఇలా వీరికి డబ్బు కట్టి మోసపోయిన నిరుద్యోగులు ఇప్పటివరకు 42 మంది తేలారు. మామఅల్లుళ్లిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అందులోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో నిరుద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వీరిపై అపారమైన నమ్మకంతో సొమ్ములు ముట్టజెప్పారు.
మోసపోయిన వాళ్లలో అత్యధికులు...తోటి ఉద్యోగులే...
వీరికి ఇలా డబ్బు కట్టి మోసపోయిన వారిలో ఎక్కువమంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, వారి బంధువులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అని తెలుస్తోంది. అయితే వీరు డబ్బులు వసూలు చేసిన అనంతరం నెలలు గడుస్తున్నా ఉద్యోగాల సంగతి ఎత్తకుండా సైలెంట్ గా ఉంటుండటంతో బాధితులు ఉద్యోగాల కోసం వారిని గట్టిగాఒత్తిడి చేశారు. దీంతో శివకుమార్ బాధితుల్లో కొందరికి అపాయింట్మెంట్ ఆర్డర్ లు తెచ్చి ఇచ్చాడు. అయితే వీటిని తీసుకొని ఉద్యోగంలో చేరేందుకు వెళ్లిన నిరుద్యోగులకు అవి నకిలీ పత్రాలని తేలిపోయింది. దీంతో బాధితులంతా ఒకటౌ శనివారం ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదు పెందుర్తి పోలీసుస్టేషన్కు బదిలీ చేశారు. దీంతో సీఐ ఎస్.సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టి బాధితులను ఆదివారం పెందుర్తి పోలీస్ స్టేషన్కు పిలిపించారు.
పోలీసుల అదుపులో నిందితులు...
ఫిర్యాదుల వెల్లువ...పోలీసుల అదుపులో నిందితులు... మోసపోయిన నిందితుల్లో ఇప్పటివరకు 42మంది నుంచి ఫిర్యాదులు అందినట్లు సీఐ తెలిపారు. బాధితుల నుంచి నిందితులు సుమారు రూ. కోటి వరకు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. దీంతో మామ అల్లుళ్లు తెడ్లపు రామారావు, శివకుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు నిందితుడు శివకుమార్ చేసిన మోసం హైదరాబాద్లోని ఎన్ఎఫ్సి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతడ్ని సస్పెండ్ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే ఈ మోసంలో వీరితో పాటు మరికొందరు కూడా పాలుపంచుకున్నట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.