ఢిల్లీలో కెటిఆర్ బిజీ: త్వరలో తెలంగాణలో జాబ్ మేళా
న్యూఢిల్లీ: తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కెటి రామారావు బుధవారం ఢిల్లీలో బిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. త్వరలో తెలంగాణలో ఉద్యోగాల జాతర రానుందని ఆయన చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశామని, రాష్ట్ర అవసరాలను వారి ముందుంచామని ఆయన చెప్పారు.
డిల్లీలో చేనేత, జౌళీ శాఖ మంత్రుల భేటీ అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కూడా అడిగినట్లు ఆయన చెప్పారు.
హైదరాబాదులో ఎన్టీఆర్ఐ ఏర్పాటు చేయాలని కోరినట్లు కూడా కెటిఆర్ చెప్పారు. మర మగ్గాల ఆధునీకీరణకు సాయం చేయాలని కేంద్ర మంత్రి గాంగ్వర్ను కోరామని, తమ వినతులపై సంతోష్ గాంగ్వర్ సానుకూలంగా ప్రతిస్పందించారని తెలంగాణ మంత్రి చెప్పారు.
రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఉండాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కోరినట్లు ఆయన తెలిపారు. ఒకే ఆవరణలో రెండు రాష్ట్రాల హైకోర్టులు ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ పరికరాల పరిశ్రమ నెలకొల్పాలని అడిగినట్లు చెప్పారు.