'దేవినేని ఉమా ఓ దద్దమ్మ', 'నీళ్లు రాని ప్రాజెక్టులు ఎన్నయితే ఏం?'
హైదరాబాద్: నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు నోరు మెదడపడం లేదని వైసీపీ అధికార ప్రతినిధి జోకి రమేశ్ విమర్శించారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ కృష్ణా డెల్టాను ఎడారిగా చేసే తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో చంద్రబాబు విఫలమైయ్యారని దుయ్యబట్టారు.
పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల వల్ల 150 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణ సర్కార్ తరలించుకుపోతుందని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర చంద్రబాబు గంగిరెద్దులా మారారని ఎద్దేవా చేశారు.
ఈ రెండు ప్రాజెక్టులపై కేంద్రం, కృష్ణా బోర్డు వద్ద ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుతో కేసీఆర్... చంద్రబాబుని హైదరాబాద్ నుంచి భలేగా తరిమికొట్టారని అన్నారు. అందుకే ఈ రెండు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపడం లేదని అన్నారు.
ఇక మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పెద్ద దద్దమ్మ అంటూ మండిపడ్డారు. ప్రెస్మీట్లు పెట్టి సొళ్లు కబుర్లు చెబుతారు కానీ.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై మాత్రం స్పందించరంటూ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ రెండు ప్రాజెక్టులను వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
నీళ్లు రాని ప్రాజెక్టులు ఎన్నయితే ఏం?: తెలంగాణ సర్కార్పై దేవినేని
మరోవైపు అనుమతి లేని ప్రాజెక్టులను కడుతున్న తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోనుందని ఏపీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. నీరు రాని చోట్ల ప్రాజెక్టులను నిర్మిస్తోందని విమర్శించారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనుమతులు లేని ప్రాజెక్టులు నిర్మించాలని చూశారని, టెండర్లు పిలిచి వేల కోట్ల రూపాయలను వృథా చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్ సర్కారు అదే పని చేస్తోందని అన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణా, గోదావరి ఎగువ ప్రాంతాల్లో కడుతున్న ప్రాజెక్టుల వల్ల నదుల్లోకి నీరు రావడం లేదని గుర్తు చేశారు.