జర్నలిస్టులు జగన్ను ఆరాధించాలి; తొలినాడే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ షాకింగ్ సలహా
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత కొత్తగా మంత్రులు అయిన వారు ఈరోజు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న వారు ఈ రోజు వారి చాంబర్లలో మంత్రులుగా బాధ్యతలను స్వీకరించారు. గతంలో మంత్రిగా పనిచేసి, మళ్లీ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనులు, విద్యుత్, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇదే సమయంలో రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ సచివాలయంలో తన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు. ఇక బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ మంగళవారం నాడు బాధ్యతలను స్వీకరించారు.
పాత్రికేయులకు మంత్రి షాకింగ్ సలహా
సచివాలయం రెండో బ్లాక్ లో తన చాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి నాడే షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను ఆరాధించాను కాబట్టే తనకు మంత్రి పదవి వచ్చిందని, జర్నలిస్టులు కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆరాధిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు.
జగన్ గురించి ఆరా తీయటం మాని ఆరాధించండి అంటూ వ్యాఖ్యలు
పాత్రికేయుల సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని పేర్కొన్న ఆయన పాత్రికేయులు కూడా సీఎం జగన్ ను మనస్ఫూర్తిగా ఆరాధించాలని, అప్పుడే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. సీఎం జగన్ గురించి ఆరా తీయడం మాని, ఆరాధించటం నేర్చుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. ఆరాతీస్తే ఆరాధనకు సరైన ఫలాలు రావని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు. ఇక ఆరా తీయడమే తమ ఉద్యోగం అంటూ జర్నలిస్టులు పేర్కొన్నారు. అయినప్పటికీ తనదైన శైలిలో మాట్లాడిన మంత్రి సిఎంను ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు వస్తాయని పేర్కొన్నారు.
మంత్రి వేణు గోపాల కృష్ణ చేసిన వ్యాఖ్యలకు అవాక్కైన పాత్రికేయులు
చిత్తశుద్ధితో ఆరాధిస్తే మీ కల తప్పక నెరవేరుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ భజన చెయ్యాలని మంత్రి పాత్రికేయులకు సెలవిచ్చారు. బాధ్యతలు చేపట్టిన తొలినాడే మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ చేసిన వ్యాఖ్యలకు పాత్రికేయులు అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పౌర సంబంధాల మంత్రి హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలకు వారంతా అవాక్కయ్యారు. ఆయన వ్యాఖ్యలను పలువురు జర్నలిస్ట్ లు తప్పుబట్టారు.
మంత్రి వ్యాఖ్యలను తప్పు పడుతున్న జర్నలిస్టులు
ఇక మంత్రి వ్యాఖ్యలను పలువురు జర్నలిస్టులు తప్పుబడుతున్నారు. జర్నలిస్టులు అంటే ప్రభుత్వ విధానంలో ఉన్న లోపాలను ఎత్తిచూపే వారిని, ప్రభుత్వం తమ తప్పులను సరిదిద్దుకునేలా వార్తా కథనాల ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వంతెనలా వ్యవహరించే వారని, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వార్తల రూపంలో తెలియజేసేవారని సీనియర్ పాత్రికేయులు అంటున్నారు . రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పని చేసేవారిని, అలాంటి జర్నలిస్టులను జగన్ ను ఆరాధించమని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పౌర సంబంధాల మంత్రి పరిజ్ఞానం ఈ పాటిది అంటూ జర్నలిస్టులు మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.