సీఎం జగన్ ను కలిసిన జోయ్ అలుక్కాస్ అధినేత.. ఎందుకంటే
దేశంలోనే ప్రముఖ నగల వ్యాపార సంస్థ, నగల వ్యాపారంలో లీడింగ్ లో ఉన్న సంస్థ అయిన జోయ్ అలుక్కాస్ గ్రూప్ చైర్మన్ అలుక్కాస్ వర్గీస్ జోయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అమరావతి లోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డితో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి అనేక కీలక అంశాలపై ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు, ఉన్నటువంటి అవకాశాలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ భేటీలో ఆయనతో చర్చించినట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి సహాయ సహకారాలు కావలసి వచ్చినా చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రముఖ నగల వ్యాపార సంస్థ అధినేతకు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఏపీలో అమలు చేస్తున్న ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను జగన్మోహన్ రెడ్డి ఆయనకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
ఏపీలో సుశిక్షితులైన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి జోయ్ అలుక్కాస్ గ్రూప్ చైర్మన్ కు వివరించారు. ఏపీకి జోయ్అలుక్కాస్ వస్తే తమ స్వాగతిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వారికి కావలసిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఇక ఈ సమావేశంలో జోయ్ అలుక్కాస్ అధినేత అలుక్కాస్ వర్గీస్ జోయ్ తో పాటు జోయ్ అలుక్కాస్ సివోవో హెన్రీ జార్జ్, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.