'సమైక్యాంధ్ర సింహం': సిఎం కిరణ్ రెడ్డి కోటరీ ఇదే
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వెనక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారనే అనుమానాలను తెలంగాణ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన పలువురు నాయకులు ఇదే విమర్శ చేస్తున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేర హైదరాబాదులో సభను పెట్టించింది కూడా ముఖ్యమంత్రేనని తెరాస నాయకులు విమర్శించిన విషయం తెలిసిందే. వి హనుమంతరావు వంటి కాంగ్రెసు నాయకులు కూడా అశోక్ బాబు వెనక కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణపై పూర్తిగా తన వైఖరిని మార్చుకుని సమైక్యాంధ్ర నినాదాన్ని భుజాన వేసుకున్నారు. అయినా అశోక్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు కోరడం గానీ ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం గానీ చేయడం లేదు. దీంతో సీమాంధ్ర ఉద్యోగుల్లో ఒక వర్గాన్ని వైయస్ జగన్ ప్రోత్సహిస్తున్నారనే మాట వినిపిస్తోంది.
దాంతో అశోక్ బాబు ముఖ్యమంత్రి కోటరీలో చేరిపోయారని అంటున్నారు. అదే విధంగా కొద్ది మంది మంత్రులు ముఖ్యమంత్రికి మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి కోటరీలో గంటా శ్రీనివాస రావు, శైలజానాథ్, ఏరాసు ప్రతాపరెడ్డి, మరి కొంత మంది మంత్రులు ఉన్నట్లు చెబుతున్నారు. పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా ముఖ్యమంత్రికి మద్దతుగా నిలుస్తున్నారు.
గతంలో ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన తెంలగాణ మంత్రులు శ్రీధర్ బాబు, డికె అరుణ వంటివారు ఇప్పుడు రూటు మార్చారు. ముఖ్యమంత్రిపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. శ్రీధర్ బాబు బుధవారంనాడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సీమాంధ్ర మంత్రులు కొంత మంది తిరుగుబాటు ప్రకటించారు.
గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ బహిరంగంగా బుధవారం విమర్శలు చేశారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు ఆనం రామనారాయణరెడ్డి, సి. రామచంద్రయ్య, ఎన్ రఘువీరా రెడ్డి, బాలరాజు, మహీధర్ రెడ్డి వంటి సీమాంధ్ర మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు.
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న గంటా శ్రీనివాస రావు గతంలో కేంద్ర మంత్రి చిరంజీవి వెన్నంటి ఉండేవారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ విలీనంతో చిరంజీవితో పాటు కాంగ్రెసులోకి వచ్చారు. చిరంజీవి చలువతోనే రాష్ట్ర మంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు ఆయన చిరంజీవికి దూరమై కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరైనట్లు చెబుతున్నారు.
కొండ్రు మురళి తనకు మంత్రి పదవి దక్కడంతో ముఖ్యమంత్రికి అత్యంత విధేయుడిగా మారిపోయారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఓ శాఖను డిఎల్ రవీంద్రా రెడ్డి నుంచి విడదీసి ముఖ్యమంత్రి కొండ్రు మురళికి ఇచ్చారు.