టీడీపీని రక్షించే వాడు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే .. మరోమారు తెరపైకి యువనాయకుడి అంశం
Recommended Video
ఏపీలో జరిగిన ఎన్నికలలో టిడిపి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటమిని చవిచూసింది. అంతటి దారుణమైన ఓటమి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఊహించలేకపోయారు. కేవలం ఇరవై మూడు స్థానాలకే టిడిపి పరిమితం కావడం దేశవ్యాప్త చర్చకు కారణమైంది. ఇక అప్పటినుండి నేటి వరకు పాలన చేపట్టిన జగన్ తన వంద రోజుల పాలన పూర్తి చేసినప్పటికీ నేటికీ టార్గెట్ చంద్రబాబు అంటున్నారు. ఇక ఈ సమయంలో మరోమారు తెరపైకి యువనాయకుడి అంశం వచ్చింది .

ఏపీలో క్లిష్ట పరిస్థితులలో టీడీపీ ... దిక్కుతోచని స్థితిలో తెలుగు తమ్ముళ్ళు
టిడిపిని నామరూపాలు లేకుండా చేయాలని, చంద్రబాబు పాలన చేసిన రోజుల నాటి అవినీతిని బయట పెట్టాలని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదే క్రమంలో టీడీపీలో కీలక భూమిక పోషించిన నాయకులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు కేసులలో టిడిపి నాయకులు సతమతమవుతున్నారు. చాలా మంది టిడిపి నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లి దిక్కుతోచని స్థితిలో ఇబ్బంది పడుతున్నారు. ఇక పలువురు నేతలు జంప్ అవుతున్నారు.

యువనాయకత్వం అవసరం అని ఫీల్ అవుతున్న టీడీపీ శ్రేణులు
ఇక అధికార పార్టీ , టీడీపీ శ్రేణుల పై దాడులకు పాల్పడుతోందని టిడిపి అధినేత చంద్రబాబు వైసిపి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ దాడిని, టిడిపి పూర్తిస్థాయిలో ఎదుర్కోలేక ఇబ్బంది పడుతోందని తెలుగు తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి యువ నాయకత్వం అవసరమని చాలా స్ట్రాంగ్ ఫీలవుతున్నారు.
ఇక మొన్నటి వరకు టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేపడితే బావుంటుందని సినీ వర్గానికి చెందిన పలువురు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. తెలుగు తమ్ముళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాక కోసం బాగానే ఎదురు చూశారు.

జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలని ఇప్పటికే కోరిన పలువురు ప్రముఖులు
ఇక రాంగోపాల్ వర్మ అయితే టీడీపీని కాపాడగలిగిన వాడు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే అని, చంద్రబాబు పనైపోయిందని బాహాటంగానే సోషల్ మీడియా వేదికగా తేల్చి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఇంత ఘోర ఓటమిని సైతం ప్రజలు మరచిపోతారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్థానాన్ని నారా లోకేష్ భర్తీ చేయలేరని టిడిపి శ్రేణుల్లో బలమైన భావన ఉన్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండుతుందని భావిస్తున్నారు. ఇక తాజాగా మరోమారు పార్టీని కాపాడగలిగిన నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అనే అంశం తెరపైకి వచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ తప్ప పార్టీని రక్షించేవాడు లేడని చెప్పిన నటుడు గిరిబాబు
సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు గిరిబాబు ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహానటుడు సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో తాను కూడా ఉన్నానని, కానీ ఎన్టీఆర్ నుండి పగ్గాలు మారిన తర్వాత పార్టీలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలి అంటే అది జూనియర్ ఎన్టీఆర్ తోనే సాధ్యమని, జూనియర్ ఎన్టీఆర్ తప్ప పార్టీని రక్షించేవాడు లేడని సీనియర్ నటుడు గిరిబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

చంద్రబాబు సైతం పార్టీలో జోష్ నింపే యువనేత కోసం అన్వేషణ
కానీ ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం పై ఏ విధమైన స్పందన తెలియజేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలని టిడిపి లోని ఒక వర్గం బలంగా కోరుకుంటుంటే, మరో వర్గం అంతే బలంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు కూడా టిడిపిని ముందుండి నడిపించే నాయకుడు కోసం తీవ్రంగానే అన్వేషిస్తున్నారు. నారా లోకేష్ తన స్థానాన్ని భర్తీ చేయగలడు అన్న భావనలో ఆయన సైతం లేరని సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ స్పందన కోసం తెలుగు తమ్ముళ్ళు, అభిమానుల నిరీక్షణ
వయసు కూడా పెరుగుతుండటంతో చంద్రబాబు అన్నింటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు. కాగా పార్టీకి మునుపటి చరిష్మా రావాలంటే పార్టీ పగ్గాలను ఎవరైనా యువకులకు అప్పగించాలని భావన. ఎన్టీఆర్ అయితేనే పార్టీకి మునుపటి బలాన్ని తిరిగి తీసుకురాగలడని, అంత సత్తా ఉన్న వ్యక్తి కేవలం ఎన్టీఆర్ ఒక్కడే అని అందరు భావిస్తున్నారు. ఇక ఇంతటి కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పట్ల తన స్పందన తెలియ చేయకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.












Click it and Unblock the Notifications