జగన్పై కాదు, చేసి చూపించు: లగడపాటిపై జూపూడి
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్ అండ చూసుకుని, తమ పార్టీవారిని కూడా కాదని కాంగ్రెసు అధిష్టానం విభజనకు పూనుకుందని లగడపాటి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. జైల్లో ఉన్నా, బయట ఉన్నా విభజనపై పోరాటం చేసిన ఏకైక వ్యక్తి జగన్ ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర కోసం లగడపాటి పోరాటాలు చేసి ఉంటే, ఇప్పుడు రాజీనామా చేసి బయటకు రావాలని ఆయన సవాల్ విసిరారు. విభజనను అడ్డుకోవాల్సిన తెలుగుదేశం పార్టీ నేతలు తమను విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ఇంకా పార్టీలో ఎందుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు. మంత్రి వర్గ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని ఆయన అన్నారు. తాము సీమాంధ్ర బంద్కు ఇచ్చిన పిలుపునకు అనూహ్యమైన స్పందన లభించిందని ఆయన చెప్పారు.
చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ఫైర్
రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. తమ పార్టీ చేపట్టిన బంద్ విజయవంతమైందని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. బంద్ విషయంలో చంద్రబాబు వెనకడుగు వేయడం సరి కాదని ఆయన అన్నారు.