విచారణనుంచి తప్పుకోవాలా ? ఇదో కొత్త ట్రెండ్- జగన్ సర్కారు పిటిషన్లపై జడ్జి ఆవేదన
ఏపీలో కొంతకాలంగా ప్రభుత్వానికీ, హైకోర్టుకూ మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం పరాకాష్టకు చేరింది. మిషన్ బిల్డ్ ఏపీ కేసుల్లో న్యాయమూర్తి రాకేష్ కుమార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నందున ఆయన్ను తప్పించాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ దీనంతటికీ కారణమైంది. కేసుల విచారణ నుంచి తనను తప్పించాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ రాకేష్ కుమార్ అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి గతంలో ఇలాంటి కేసుల్లో ఏం జరిగిందో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపి విచారణ వాయిదా వేశారు. ఇప్పుడీ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

జస్టిస్ రాకేష్ను తప్పించాలని జగన్ సర్కారు పిటిషన్లు
ప్రస్తుతం ఏపీ హైకోర్టులో ఉన్న సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన జస్టిస్ రాకేష్ కుమార్ పలు కీలక కేసులను విచారిస్తున్నారు. ఇందులో రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా దాఖలవుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్లతో పాటు ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టే కీలకమైన మిషన్ బిల్డ్ ఏపీ ప్రాజెక్టుపై దాఖలైన కేసులను కూడా విచారిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఈ రెండు కేసుల్లోనూ పలు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
హెబియస్ కార్పస్ పిటిషన్లపై అయితే ఏకంగా రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం అయిందంటూ కేసును మరో మలుపు తిప్పారు. దీంతో ప్రభుత్వం తీవ్రంగా ఇరుకునపడింది. మిషన్ బిల్డ్ ఏపీ కేసుల్లోనూ ఆయన ప్రభుత్వం దివాలా తీసిందా అని ప్రశ్నించారు. దీంతో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా విచారిస్తున్ కేసుతో పాటు మిషన్ బిల్డ్ ఏపీ కేసుల్లో రాకేష్ కుమార్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నందున వాటి విచారణ నుంచి ఆయన్ను తప్పించాని ప్రభుత్వం అనుబంధ పిటిషన్లు దాఖలు చేసింది.

నన్నే తప్పించాలా ? జస్టిస్ రాకేష్ కుమార్ ఆవేదన
రాష్ట్ర ప్రభుత్వం పలు అనుబంధ పిటిషన్లలో పలు కేసుల విచారణ నుంచి తనను తప్పించాలని కోరడంపై జస్టిస్ రాకేష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కెరీర్ చివరి దశలో ఉన్న తనను తప్పించాలని కోరడంపై స్పందిస్తూ .. జడ్జీలనే తప్పుకోవాలనే ట్రెండ్ మొదలైనట్లుందన్నారు. తన ప్రొఫెషనల్ కెరీర్ చివరి దశలో ఇదో కొత్త అనుభవం అన్నారు. ఇలా ప్రతీ పిటిషన్పై అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఇక న్యాయమూర్తులు విధులు నిర్వర్తించడం కష్టమన్నారు.
రాష్ట్రంలలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అన్న పిటిషన్ విచారణ సందర్భంగా గతంలో జారీ చేసిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. అయితే ఆ ఉత్తర్వులు తమకు అందలేదని ప్రభుత్వం చెప్పడంతో జడ్జిని తప్పించాలన్న పిటిషన్ విచారణ వాయిదా పడింది.

జడ్జీలు వస్తుంటారు, పోతుంటారు...
రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అన్న విషయం తేల్చడానికి హైకోర్టు సాగిస్తున్న విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది నిరంజన్రెడ్డి మాట్లాడుతూ విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తికి గౌరవ ప్రదంగా విజ్ఞప్తి చేశామన్నారు.. రాజ్యాంగ విచ్ఛిన్నం విషయం వ్యవస్ధలకు సంబంధించిందన్నారు. జడ్జీలు వస్తుంటారు, పోతుంటారని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తద్వారా మీరు తప్పుకుంటేనే మంచిదని జస్టిస్ రాకేష్కుమార్కు ప్రభుత్వం తరఫున సూచించారు. మరో సీనియర్ లాయర్ సీవీ మోహన్రెడ్డి వాదిస్తూ విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదన్నారు.
Recommended Video

గుంటూరు కేసులోనూ తప్పుకోమంటారేమో...
తొలుత మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన కేసుల విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం జస్టిస్ రాకేష్ కుమార్పై పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత రాజ్యాంగ విచ్చిన్నం కేసు విచారణ నుంచి తప్పుకోవాలని మరో అనుబంధ పిటిషన్ వేసింది. వీటిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ రాకేష్ కుమార్.. తాను విచారిస్తున్న పాత గుంటూరు ఠాణాపై దాడి కేసు నుంచి కూడా తప్పుకోమంటారేమో అని సందేహం వ్యక్తం చేశారు. ఇలా వృత్తి జీవితం చివరి దశలో తాను ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడం బాధ కలిగిస్తోందని జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వం తనను పలు కేసుల నుంచి తప్పుకోమంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కౌంటర్లు అందాక గత తీర్పుల ఆధారగా విచారించి నిర్ణయం వెలువరిస్తామన్నారు.












Click it and Unblock the Notifications