ట్విస్ట్: రాజ్యసభ తెరాస అభ్యర్థి కెకె, గెలుపు వ్యూహం...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఆ పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు రాజ్యసభ బరిలోకి దిగనున్నారు. కెకెను తెరాస తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ప్రకటించారు. కెకెను గెలిపించుకునేందుకు తెరాస ప్రయత్నాలు చేస్తోంది. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది.
తెలంగాణ భవన్లో గణతంత్ర వేడుకలకు వచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... కెకె ఏకగ్రీవంగా ఎన్నికవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనను గెలిపించేందుకు తమ వ్యూహం తమకు ఉందన్నారు.

ఆయనను గెలిపించుకునేందుకు తాము అన్ని పార్టీలను కలుస్తున్నామని చెప్పారు. కెకెకు సముచిత ప్రాధాన్యత లభిస్తుందని చెప్పారు. కె కేశవ రావుకు ఇతర పార్టీలు మద్దతు పలుకుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఞతలు అని కె కేశవ రావు చెప్పారు.
రాజ్యసభ సీటు గెలవాలంటే దాదాపు నలభై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. తెరాసకు సగం మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో తెరాస కెకెను నిలబెట్టడం ఆసక్తికరంగా మారింది. కెకెకు బిజెపి, సిపిఐ నేతలు మద్దతు పలికే అవకాశాలు లేకపోలేదు. బలం లేదని ఇప్పటికే జగన్ పార్టీ బరి నుండి తప్పుకుంది. తెరాస మాత్రం కెకెను నిలబెట్టి ట్విస్ట్ ఇచ్చింది.
కాగా, ఆరు రాజ్యసభ స్థానాలకు గాను కాంగ్రెసు మూడు, తెలుగుదేశం రెండింటిని గెలుచుకునే అవకాశముంది. కెకెతో పాటు ఎవరైనా బరిలోకి దిగితే ఆరో అభ్యర్థి కోసం పోటీ జరగనుంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ ఎన్నికల బరి నుండి తప్పుకుంది. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు పలువురు సమైక్యం పేరుతో బరిలోకి దిగనుండటంతో మూడు స్థానాల పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications