నేనే వస్తున్నా! ఒకరు తిడితే.. మరొకరు దాడులు: ఏపీ రాజకీయ పరిస్థితులపై కేఏ పాల్ తీవ్ర స్పందన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు దోపిడీకే సరిపోయాయని మండిపడ్డారు. ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు.
ఒకరు తిడతారు.. మరొకరు దాడులు చేస్తారు.. ఇదే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతోందని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగడం లేదని అన్నారు. ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలకాలని వ్యాఖ్యానించారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, యువత, నిరుద్యోగులు, మహిళలు అన్ని సామాజిక వర్గాలు.. ప్రజాశాంతి పార్టీతో కలిసి ఒక్కటి కావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రేమించేవాల్లు, అభివృద్ధి కోరుకునేవాళ్లు తనతో కలిసి నడవాలని కోరారు. ఈ శనివారం ఉదయం హైదరాబాద్లో.. ప్రముఖులంతా తన పార్టీలో చేరబోతున్నారని కేఏ పాల్ పేర్కొన్నారు.
అప్పులు చేసి అభివృద్ధి చేయడం.. తిరిగి అప్పులు తీర్చడం తనతో తప్ప మరెవరితోనూ సాధ్యం కాదని కేఏ పాల్ అన్నారు. ప్రజల కోసం రాత్రనక, పగలనక పనిచేసేందుకు తాను సిద్ధపడ్డానని ఆయన తెలిపారు. త్వరలో తాను వచ్చేస్తున్నా.. అంటూ తెలుగు ప్రజలకు తెలిపారు.
దేశ వ్యాప్తంగా ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని.. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని.. ఇలాంటి సమయంలో దాడులు, అరెస్టులు, తిట్లతో రాజకీయాలు చేస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది చాలని, తాను వచ్చేస్తున్నానని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంతా కలిసి నడుద్దామని కేఏ పాల్ పిలుపునిచ్చారు.
కాగా, ఏపీలో విమర్శలు, దాడులతో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణ నెలకొన్న విషయం తెలిసిందే. టీడీపీ నేత పట్టాభి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారనే ఆరోపణలతో వైసీపీ శ్రేణులు.. పట్టాభి ఇంటితోపాటు రాష్ట్రంలోని పలు టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 36 గంటలపాటు నిరసన దీక్ష చేపట్టారు. దీనికి కౌంటర్గా వైసీపీ నేతలు జనాగ్రహ దీక్షలు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.