కిడారి సర్వేశ్వరరావు, వైఎస్ వివేకా హత్యోదంతాలుః రెండు సంఘటనల్లోనూ ఎస్పీ ఒక్కరే!
అమరావతిః రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన ప్రస్తుత పరిస్థితుల్లో హఠాత్తుగా చోటు చేసుకున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలు తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించాయి. టీడీపీ నాయకులను ఆందోళనకు గురి చేశాయి. ఆత్మరక్షణలో పడేశాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సహా శ్రీకాకుళం, కడప జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు వెంకటరత్నం, రాహుల్ దేవ్ శర్మపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడం తెలుగుదేశంలో ప్రకంపనలు పుట్టించింది. ఈ ముగ్గురు అధికారుల పనితీరు అత్యంత వివాదాస్పదమని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై వారు ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ బదిలీలు దాని ఫలితమే. ప్రత్యేకించి- రాహుల్ దేవ్ శర్మ బదిలీ కావడం ప్రత్యేకంగా చర్చనీయాంశమౌతోంది.
సర్వేశ్వరరావు, వివేకా హత్యోదంతాల సమయంలో ఆయనే ఎస్పీ..
ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఉత్తరాన చివరన ఉండే జిల్లా విశాఖపట్నం. అలాగే- దక్షిణ దిక్కున ఉండే జిల్లా కడప. ఈ రెండు జిల్లాల్లో చోటు చేసుకున్న హత్యోదంతాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైనవే. విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపారు అదీ పాయింట్ బ్లాంక్ రేంజ్లో. అలాగే- మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి కడప జిల్లా పులివెందులలో తన స్వగృహంలో కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఈ రెండింటికీ ఓ థ్రెడ్ ఉంది. అదే- జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అధికారి. రాహుల్ దేవ్ శర్మ. మావోయిస్టులు కిడారిని హత్య చేసిన సమయంలోనూ, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సందర్భంలోనూ రాహుల్ దేవ్ శర్మే ఆయా జిల్లాల ఎస్పీగా ఉన్నారు. ఆయనపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
ఏబీ పనితీరుపైనా విమర్శలు..
ఉనికినే కోల్పోయారునకుంటున్న సమయంలో మావోయిస్టులు విజృంభించి, ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ ఎమ్మెల్యేను అతి సమీపం నుంచి కాల్చిచంపి, ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని గంటల పాటు సంచరించిన సమాచారాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో ఎందుకు ముందే సేకరించలేకపోయిందంటూ అప్పట్లో విమర్శలు చెలరేగాయి. ఏజెన్సీ గ్రామాల్లో మావోయిస్టులు ఉందే రెక్కీ వేసుకుని మరీ ఓ ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపేంత వరకూ పరిస్థితి వచ్చిందంటే.. ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తోందంటూ అప్పట్లో విమర్శలు చెలరేగాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయంలో ఉండే విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాప్రయత్నం జరగ్గా.. దీనికి సంబంధించి ఏ చిన్న నిఘా సమాచారన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో ముందే ఎందుకు సేకరించలేకపోయిందనే ఆరోపణలు ఇంటెలిజెన్స్ బ్యూరో మీద ఉన్నాయి.
నిఘా డిజిని బదిలీకి అధికారం లేదు
కదలికలను ఏ మాత్రం పసిగట్టలేకపోయిందా?
నిజానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రధాన కర్తవ్యం కూడా అదే. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, మావోయిస్టులు, ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి కదలికలపై డేగకన్ను వేయాల్సిన ఇంటెలిజెన్స్ బ్యూరో.. ఏబీ వెంకటేశ్వరరావు హయాంలో నిద్రావస్థలోకి జారుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏబీ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం మొత్తం ప్రతిపక్ష నేతల కదలికలపైనే దృష్టి పెట్టిందని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ చురుగ్గా వ్యవహరించిందంటూ విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా.. ఎన్నికల పైనే దృష్టి పెట్టిందని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపోటముల మీద నిఘా పెట్టిందని, ప్రతి చిన్న విషయాన్నీ ఆరా తీస్తోందంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం వారిపై బదిలీ వేటు వేసింది.
ఈ చర్యలు సరిపోవు.. ఇంకా ఉన్నారంటోన్న వైఎస్ఆర్ సీపీ
ఏబీ వెంకటేశ్వరరావు సహా రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నంలపై బదిలీ వేటు వేయడాన్ని ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ కంటితుడుపు చర్యగా అభివర్ణించింది. ఈ చర్యలు సరిపోవని, టీడీపికి వత్తాసు పలికే పోలీసు అధికారులు ఇంకా ఉన్నారని పేర్కొంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ ఠాకూర్ బదిలీ విషయం ఈసీ పట్టించుకోలేదని, ఘట్టమనేని శ్రీనివాసరావు, ఓఎస్డీ యోగనంద్, కోయా ప్రవీణ్, దామోదర్, విక్రాంత్ పాటిల్ పైనా చర్యలు తీసుకోవాలని తాము ఈసీ కోరినట్లు వైఎస్ఆర్ సీపీ నాయకులు చెబుతున్నారు. డీజీపీ ఠాకూర్ ను కూడా బదిలీ చేయాలని వారు పట్టుబడుతున్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో ఠాకూర్ విఫలమయ్యారని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.