నీచులు: ఎర్రబెల్లి-మోత్కుపల్లిలపై కడియం, రేవంత్ రెడ్డి నిప్పులు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల పైన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు నేతలు తన కులం గురించి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని విమర్సించారు. అలాగే ప్రభుత్వం పైన కూడా హద్దులు దాటుతున్నారన్నారు. వారు ఎంత నీచులో వారి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. తన సామాజిక వర్గం గురించి అనవసర వ్యాఖ్యలు వద్దన్నారు.
తాను ఎస్సీనే కాదని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అంటున్నారని, దానిని తాను సవాల్ చేస్తున్నానని చెప్పారు. నేను మాదిగ సామాజిక వర్గంలోని ఉపకులమైన బైండ్లకు చెందిన వాడినన్నారు. తాను చదువుకునేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు, రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు.. అన్నింటా ఆ సర్టిఫికేటే వాడుకున్నానని చెప్పారు. మోత్కుపల్లి తన పైన చేసిన వ్యాఖ్యలుకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.
చంద్రబాబు ఆయన వాదనతో ఏకీభవిస్తున్నారా చెప్పాలన్నారు. లేదంటే తాను చట్టపరంగా ముందుకు వెళ్తానని చెప్పారు. టీడీపీలోని నేతలు రోజుకొకరు పార్టీని ఎందుకు వీడుతున్నారో గుర్తించాలన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే తాను ముందుకు వచ్చానన్నారు.
ఒకరు తెరాసలో చేరి మంత్రి అవుదామనుకున్నారని, మరోకరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండి ప్రజల చేతిలో చావుదెబ్బలు తిన్నారని ఎర్రబెల్లి, మోత్కుపల్లిలను ఉద్దేశించి అన్నారు. తాను తన కులంకు చెందిన సర్టిఫికేట్ కలెక్టర్కు ఇచ్చానని, వెరిఫై చేసుకోవచ్చునని చెప్పారు.
ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి నిప్పులు
నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫీయా అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతిపై చర్యలు తీసుకుంటామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజామాద్ జిల్లాలోని బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇసుక దందాలో మంత్రి కుమారుడి ప్రమేయం ఉందని ఆరోపించారు.
వేలకొద్ది లారీల ఇసుక అక్రంగా తరలిస్తుంటే కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలంగాణలో ఎమర్జెన్సీ విధించినట్లుగా ఉందని, అవినీతికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకు మీడియా గొంతు నొక్కుఉతన్నారని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దళితుడైన రాజయ్యకు అన్యాయం జరిగిందన్నారు.
వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా అవినీతి ఆరోపణలతో ఆయనను బర్తరఫ్ చేశారన్నారు. ఇసుక దందాలో ప్రమేయం ఉన్న మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసే మంత్రి హరీష్ రావు, అక్రమంగా ఇసుక తరలిస్తుంటే ఎందుకు పట్టించుకోరన్నారు.