జగన్ పాలనలో జనసేన నేత పేరుతో: వైసీపీ నేతలు ఎందుకిలా : సీఎంకు తెలిసే జరిగిందా..!
ఏపీలో వైసీపీ పాలన సాగుతోంది. గతంలో టీడీపీ హయాంలో అనేక పధకాలకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. తమిళనాడు లో చూసిన తరువాత చంద్రబాబు ప్రభుత్వంలో అమలు చేసే పధకాలకు ఆయన పేరు ఎందకు పెట్టకూడదని అనుకు న్నారు..అంతే..అనేక పధకాలకు చంద్రన్న పేరు అమలు చేసేసారు. చంద్రబాబు సైతం స్వయంగా చంద్రన్న పధకం అంటూనే చెప్పుకొచ్చేవారు. ఇక, వైయస్ హయాంలో ఇందిరా..రాజీవ్ పేర్లు ప్రముఖంగా పధకాలకు ఖరారు చేసారు. ఇప్పుడు జగన్ హయాంలోవైయస్ పేరు వినిపిస్తోంది. కానీ, విచిత్రంగా వైసీపీ పాలనతో జనసేన నేత పేరు పెట్టటం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..ఇదే అంశంపైన వైసీపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి..
కాకినాడలో నిర్ణయం పైనే చర్చంతా..
కాకినాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తొలి నుండి జగన్తోనే ఉన్నారు. ఆయన 2009లో తొలి సారి కాకినాడ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైయస్ మరణం తరువాత జగన్కు మద్దతుగా నిలిచారు. 2014 ఎన్నికల్లో ఓడినా..2019 ఎన్నికల్లో తిరిగి గెలుపొందారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లోనై వైసిపి ఓడింది. ఇప్పుడు కాకినాడ సిటీతో పాటుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్దులే గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవటం కోసం నాడు వైసీపీ అధినేత జగన్ సైతం ప్రచారం చేసారు. అయితే, జనసేన ఏర్పాటు నుండి అక్కడ మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ కుటుంబం పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం పని చేసారు. ఆయన కుమారుడు శశిధర్ జనసేన నుండి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేసారు. అయితే, ఇప్పుడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పార్టీలోని మిగిలిన నేతలతో మాట్లాడి ఒక నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించారు. ఇప్పుడు అదే తూర్పు గోదవరి జిల్లా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.
నగరంలోని నిర్మాణానికి ముత్తా పేరు..
కాకినాడలో ఒక వంతెన నిర్మించారు. ఇప్పుడు ఆ వంతెనకు ప్రస్తుతం జనసేనలో ఉన్న ముత్తా గోపాలకృష్ణ పేరు పెట్టాలని సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రతిపాదించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని నివారిస్తూ నిర్మిస్తున్న వంతెనకు ముత్తా పేరు పెట్టాలని కాకినాడ కార్పొరేషన్ లో ప్రతిపాదించటంతో స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు విస్తుపోయారు. అయితే అప్పటికే నగర కార్పోరేషన్లో సొంత పార్టీ కార్పోరేటర్లతో పాటుగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను సైతం ఒప్పించారు. అయితే, ప్రజలకు విశేష సేవలందించిన వారికి గుర్తుగా వారి పేర్లను వాడుతూ ఉంటారు. అయితే, తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమ్మ పేరుతో అనేక పధకాలను అమలు చేసారు. ఆ తరువాత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేరుతో పధకాలు అమలు చేసారు. ఇక, ఇప్పుడు జనసేన పార్టీకి చెందిన వ్యాపారవేత్త పేరును వైసీపీ నేతే ప్రతిపాదించటం ..ఆయనకు గౌరవంగా చెప్పటం పైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సీఎం దృష్టికి వ్యవహారం
అయితే, ఈ వ్యవహాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లాలోని వైసీపీ నేతలు సిద్దం అవుతున్నారు. ద్వారంపూ డి అనుచరులు మాత్రం దీనిని సమర్ధంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలు అతీతంగా ఒకరిని మరొకరు గౌరవించుకోవటంలో భాగంగానే ఈ రకమైన ప్రతిపాదన చేసామని చెబుతున్నారు. అయితే, కింది స్థాయి కార్యకర్తల్లో ఇటువంటి నిర్ణయాల ద్వారా ఎటువంటి సంకేతాలు తీసుకెళ్లాలనుకుంటున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి. టీడీపీ ..జనసేనకు వ్యతిరేకంగా పార్టీ కేడర్ పని చేసి గెలిపిస్తే..ఇప్పుడు జనసేన పార్టీకి చెందిన వారికి పేరు తెచ్చేలా వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహరిచంటం పైన కోల్డ్ వార్ నడుస్తోంది. మరి..ఈ వ్యవహారం పైన సీఎం ఎలా రియాక్ట్ అవుతారో .. ఏం చెబుతారో చూడాల్సిందే.