విజయసాయి రెడ్డి.. సజ్జల పనేనా?: 3 రాజధానులతో సీమకేంటి ప్రయోజనం?: టీడీపీ నేతలు
అమరావతి: ఏపీ సర్కారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు సహా టీడీపీ నేతలు మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, అనగాని సత్యప్రసాద్లు ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందుతాయన్నారు.
రాజధాని రణభేరి: సీమ, ఉత్తరాంధ్రలోనూ సేవ్ అమరావతి: అంగుళం కూడా కదలనివ్వం: టీడీపీ స్ట్రాటజీ
కర్నూలులో హైకోర్టు వల్ల ఎవరికి ప్రయోజనం?
అయితే, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల వల్ల ఏ ప్రాంతమూ అభివృద్ధి చెందకపోగా, రాష్ట్రం మరింత నష్టపోతుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల వల్ల వైసీపీ నేతలకు ఆర్థికంగా ఉపయోగం తప్ప రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.అమరావతి నిర్మాణం పూర్తయితే రాయలసీమ యువతకు కూడా అక్కడే ఉపాధిలభిస్తుంది కానీ.. ఇప్పుడ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఎంతమందియువతకు ఉపాధి కల్పిస్తారో సీఎం జగన్ చెప్పాలని కాల్వ శ్రీనివాసులు నిలదీశారు.
జగన్, వైసీపీ నేతల డబ్బులు నింపడం కోసమే..
అమరావతి నిర్మాణం పూర్తయితే లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలోని లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కానీ, ఇప్పుడు విశాఖలో నాలుగు బిల్డింగులు అద్దెకు తీసుకుని అక్కడ నుంచి పరిపాలన నిర్వహిస్తే యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎలా కల్పిస్తారు? అని కాల్వ ప్రశ్నించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, రూపాయి ఖర్చు లేకుండా రాజధాని నిర్మించవచ్చు కానీ.. కేవలం జగన్ వైసీపీ నేతల జేబులు నింపడం కోసమే మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని కాల్వ అన్నారు.
విశాఖ రాజధానితో సీమకు ఏం
అమరావతి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉందని.. అనంతపురం నుంచి అరాజధాని రావాలంటే 2 గంటలే పడుతుందని..కానీ, అనంతపురం నుంచి విశాఖకు వెళ్లాలంటే 2 రోజులు పడుతుందని కాల్వ శ్రీనివాసులు అన్నారు.మూడు రాజధానుల వల్ల రాయలసీమకు ప్రయోజనం ఏంటి? అమరావతి పూర్తయితే రాయలసీమ కూడా అభివద్ది చేయవచ్చని జగన్మోహన్ రెడ్డికి సంపదను దోచుకోవడం తప్ప.. సంపద సృష్టి గురించి ఏం తెలుసు? అని కాల్వ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
విజయసాయి రెడ్డి.. సజ్జల పనేనా?
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజల ఏకాభిప్రాయంతోనే అమరావతి ఏర్పాటైందని.. ఎవరిని అడిగి సీఎం రాజధానిని మారుస్తున్నారని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి సలహాతోనా? లేక సజ్జల సలహాతోనా అని నిలదీశారు. తాబేదార్ల కోసం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాజీనామా చేస్తే.. వైసీపీ నేతలకు మళ్లీ గెలుస్తామన్న నమ్మకం లేకపోవడం కాదు.. కనీసం డిపాజిట్లు కూడా దక్కుతాయన్న ఆశ లేదన్నారు. ఆచరణ సాధ్యం కాని మూడు రాజధానుల నిర్ణయాన్ని వైసీపీ తప్ప మిగిలిన పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని.. కేవలం టీడీపీని దెబ్బతీయడం కోసమే 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును సీఎం జగన్ బలిపెడుతున్నారని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.