జగన్ జీవితమంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది: కాల్వ
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితం అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోందని టిడిపి నేత, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు శనివారం నాడు దుయ్యబట్టారు.
తెలుగుదేశం పార్టీలోకి భారీ సంఖ్యలో వైసిపి నేతలు, ఎమ్మెల్యేలు చేరుతున్నందున సేవ్ డెమోక్రసీ పేరుతో వైసిపి తమ పార్టీపై చేస్తున్న ఆరోపణలను కాల్వ తిప్పికొట్టారు. జగన్కు నైతిక విలువలు లేవని విమర్శించారు. ఆయనవి నియంతృత్వ పోకడలు అని చెప్పారు.
జగన్ తన నియంతృత్వ పోకడలను ఆపేయాలని హితవు పలికారు. వైసిపిలో ఉండలేకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు టిడిపిలో చేరుతున్నారని చెప్పారు. సేవ్ డెమోక్రసీ పేరుతో వైసిపి నాటకాలు ఆడుతోందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది ఎవరో ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. ప్రతిపక్షనేతగా జగన్ విఫలమయ్యారన్నారు.

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి. శనివారం గవర్నర్ నర్సింహన్ను పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సంతలో గొర్రెల్లా తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబునాయుడు కొంటున్నారని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 నుంచి 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications