'మహాపతివ్రతా శిరోమణి: దమ్ముంటే జగన్, చంద్రబాబు తల్లుల్ని కూడా అలా తిట్టగలవా?'
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో 'కాస్టింగ్ కౌచ్' వ్యవహారంపై ఇప్పుడో పెద్ద ఉద్యమమే నడుస్తున్న సంగతి తెలిసిందే. నటి శ్రీరెడ్డికి మద్దతుగా మహిళ సంఘాలు, ఉస్మానియా విద్యార్థులు రంగంలోకి దిగడంతో ఈ ఉద్యమం మరింత ఉధృతంగా నడుస్తోంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, బీసీ నాయకుడు కృష్ణయ్య వంటివారు సైతం శ్రీరెడ్డికి మద్దతుగా నిలవడం.. అన్ని వర్గాల వారిని ఇందులో భాగస్వామ్యం చేస్తుండటంతో.. మున్ముందు ఈ ఉద్యమం మరింత పదునెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక్కడివరకు అంతా బాగానే ఉంది కానీ.. శ్రీరెడ్డి తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటిదాకా ఆమెను సమర్థించినవారు సైతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలతో యూటర్న్ తీసుకున్నారు. శ్రీరెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని పరోక్షంగా పవన్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. మంచి ఉద్దేశంతో మొదలైన ఉద్యమాన్ని అనుచిత వ్యాఖ్యలతో చేజేతులా నీరుగార్చవద్దన్న అభిప్రాయాలు కూడా శ్రీరెడ్డిపై వ్యక్తమవుతున్నాయి.
తాజాగా జనసేన అభిమాని కల్యాణ్ దిలీప్ సుంకర ఈ అంశంపై ఓ వీడియో ద్వారా స్పందించారు. ఒక మహాపతివ్రతా శిరోమణి ఏదో అన్నదని కొంతమంది ఫ్యాన్స్ ఢీలా పడుతున్నారని, మొదట్లో శ్రీరెడ్డి ఉదంతంపై తాను కూడా విచారపడ్డానని, కానీ తాజాగా ఆమె పవన్ కల్యాణ్ పై చేసిన కామెంట్స్ తో ఇప్పటిదాకా ఉన్న సానుభూతి అంతా తుడిచిపెట్టుకుపపోయిందన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించారు.
మంచి జరుగుతుందనుకున్నా..
శ్రీరెడ్డి ఉదంతం జరుగుతున్నప్పుడు నేను చాలా బాధపడ్డా.ముఖానికి రంగులేసుకుని తెరపై కనిపించాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు వద్దంటున్నా.. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నాళ్లు ఇబ్బంది పడ్డది కదా. సినిమా అవకాశాల కోసం వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి ఆశను ఒక అవకాశం కింద మార్చుకోవాలని కొంతమంది ప్రయత్నించడం తప్పు కదా!.. ఈ విషయంలో సొసైటీలోనే ఎక్కడో లోపముంది కదా.. శ్రీరెడ్డి పోరాటంతో భవిష్యత్తు తరాలకైనా మంచి జరుగుతుంది కదా అని తాను భావించినట్టు కల్యాణ్ తెలిపారు.
అవును.. ఆయన నాయకుడే
పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసిన వ్యాఖ్యలను కల్యాణ్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ గారు బయటకొచ్చి ఈ ఉదంతంపై చేసిన వ్యాఖ్యలు.. సదరు సోకాల్డ్ ఆర్టిస్టులకు బూతులుగా కనిపించాయట అని విమర్శించారు. ఓ డాలు, కత్తి తీసుకుని బయలుదేరి ఆడపిల్లకి అన్యాయం చేసినవారిని పవన్ కల్యాణ్ గారు నరికేయలేదని వారు బాధపడుతున్నారట అంటూ వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ గారు ప్రజా నాయకుడా? అని ప్రశ్నించిన ఆ మహానటికి తాను ఒకే విషయం స్పష్టం చేస్తున్నానని అన్నారు. ప్రజా నాయకుడు కాబట్టే భావోద్వేగాలకు లోనవడని, స్థిరంగా ఉన్నాడు కాబట్టే ఆయన్ను నాయకుడు అంటున్నారని తెలిపారు.
వాళ్ల తల్లులను తిట్టగలవా?
పవన్ ఏం చెప్పారు.. చట్టాలపై గౌరవాన్ని పెంచండి అన్నారు. ముందు మీరెళ్లి మీడియాలో కూర్చొని సంచలనాలు క్రియేట్ చేయడం కంటే పోలీస్ స్టేషనుకు వెళ్లొచ్చు కదా!.. కోర్టుకు వెళ్లొచ్చు కదా.. అని పవన్ చెప్పారని కల్యాణ్ పేర్కొన్నారు. సాక్షిలో రెండేళ్లు పనిచేసిన ఈ మహాసాధ్వి 'జగన్మోహన్ రెడ్డి అన్నా ఏమైపోయావ్..' అని ఎందుకు ప్రశ్నించలేదని కల్యాణ్ నిలదీశారు. పవన్ ను తిట్టినట్టు, జగన్ వాళ్ల అమ్మను, చంద్రబాబు అమ్మను తిట్టే దమ్ము నీకు లేదని అన్నారు.
అసలు నీకు చిత్తశుద్ది ఉందా?
పెద్ద పెద్ద మాటలు, స్థాయికి మించిన మాటలు మాట్లాడవద్దని శ్రీరెడ్డిని కల్యాణ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ విషయాన్ని ప్రస్తావించారాయన. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన రాజ్ తరుణ్.. ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోతే ముందు షార్ట్ ఫిలింస్ చేశాడని, అంతేకానీ నీలా రోడ్డెక్క లేదని మండిపడ్డారు. వాటి ద్వారా తమ ప్రతిభను నిరూపించుకున్నారని అన్నారు. ఆదరించలేదని రోడ్డెక్కడం కాదని, చిత్తశుద్దితో ప్రయత్నించాలని.. అసలు నీకా చిత్తశుద్ది ఏడ్చిందా? అని కల్యాణ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.