పోటీ పడలేకే ట్యాపింగ్: రామ్మోహన్, డబ్బు ఇస్తామని చెప్పలేదన్న జెసి
చిత్తూరు: అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోటీ పడలేక.. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారని ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు అన్నారు. ఆయన శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తలనీలాలు సమర్పించి ప్రముఖుల ప్రారంభ దర్శన సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. కంభంపాటికి తితిదే అధికారులు స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల కంభంపాటి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి వస్తున్న ప్రజాదరణను చూసి వోర్వలేక, అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడలేక.. ప్రజాదరణను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని కంభంపాటి ఆరోపించారు.
రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చంద్రబాబు కోరుకుంటుంటే.. తెలంగాణ సీఎం మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని నిందించడం మంచిదికాదని కంభంపాటి రామ్మోహనరావు అన్నారు.
డబ్బులిస్తామని ఎక్కడా చెప్పలేదు: జెసి
ఓటకు నోటు వ్యవహారంపై తాడిపత్రి టిడిపి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి శనివారం అనంతపురంలో స్పందించారు. డబ్బులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడియోలో ఎక్కడా వ్యాఖ్యానించలేదన్నారు. ధైర్యం, భరోసా ఇవ్వడం చంద్రబాబుకు అలవాటని ఆయన గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డిని పట్టుకున్నప్పుడే చంద్రబాబు ఆడియో టేపులు ఎందుకు విడుదల చేయలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆయన ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు విలువలు గుర్తు రాలేదా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.