హీరోయిన్ శ్రుతిహాసన్ను ఏడ్పించారని వార్తలు: మంత్రి వివరణ
హైదరాబాద్: ప్రముఖ సినీనటి శ్రుతి హాసన్ను తాను ఏడిపించినట్లు సోషల్ మీడియాలో సందడి చేసిన వార్తలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఖండించారు. తాను శ్రుతి హాసన్ను సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అలాంటిది తాను శ్రుతి హాసన్ను ఎలా ఏడిపిస్తానని కామినేని ప్రశ్నించారు. తిరుపతికి తాను ఎప్పుడు వెళ్లిన కారులో వెళ్లి వస్తానని చెప్పారు.
ఒక్కసారి మాత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలసి తిరుపతి నుంచి విమానంలో వచ్చానని చెప్పారు. ఏదో వార్త రావడం ఆ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, దీనిపై మీడియాలో కథనాలు వెలువడటం, కనీసం వివరణ కూడా తీసుకోకుండా ప్రసారం చేయడం సరి కాదని మంత్రి కామినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా శుక్రవారం శ్రుతి హాసన్, మంత్రి కామినేని శ్రీనివాస్ ఒకే విమానంలో పక్కపక్క సీట్లలో కూర్చుని ప్రయాణం చేశారని, ఆ క్రమంలో మంత్రి కామినేని గట్టిగా ఫోన్లో మాట్లాడుతుండగా నిదానంగా మాట్లాడుకోవాలని శ్రుతి హాసన్ సలహా ఇచ్చారని సోషల్ మీడియా కథనాల వెల్లడి. దాంతో మంత్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని, తాము ప్రజా ప్రతినిధులమని, పైగా మంత్రి వర్యులమని, గట్టిగానే మాట్లాడతామని మంత్రి కోపంతో బదులు ఇచ్చారని అంటున్నారు.
దీంతో శ్రుతి హాసన్ కన్నీటి పర్యంతమైయ్యారని చెబుతున్నారు. అంతే కాకుండా పలు ఛానల్స్ కూడా ఈ వార్తను ప్రసారం చేశాయి. దాంతో ఆ కథనాలపై శనివారం మంత్రి కామినేని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. అవన్నీ కట్టుకథలేనని ఆయన కొట్టిపారేశారు.