రైతు భరోసాకు మోడీ పేరు పెట్టాలన్న కన్నా .. చంద్రబాబులా స్టిక్కర్ సీఎం కావొద్దని జగన్ కు హితవు
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అవకాశం ఉన్న ప్రతి అంశంలోనూ విమర్శలు గుప్పిస్తున్నారు . గత ప్రభుత్వం టీడీపీ హయాంలో నష్టపోయిన ప్రజలకు ఇప్పుడు వైసీపీతో కూడా నష్టం జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు . సీఎం జగన్ మాటలకు చేతలకు పొంతన లేదని గతంలోనే విమర్శించిన కన్నా లక్ష్మీ నారాయణ రైతు భరోసా పథకానికి మోడీ పేరు పెట్టాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కన్నా లక్ష్మీ నారాయణ .
హుజూర్నగర్ బరిలో 251 మంది సర్పంచ్లు: అదే బాటలో లాయర్లు: ఏ పార్టీకి నష్టం..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కన్నా లక్ష్మీ నారాయణ గత సీఎం చంద్రబాబులా ప్రవర్తించవద్దని హితవు పలికారు. జగన్ కూడా చంద్రబాబులా మరో స్టిక్కర్ సీఎం కావొద్దని , పథకాలకు తమ స్టిక్కర్స్ వేసుకోవద్దని పేర్కొన్నారు . వైసీపీ మేనిఫెస్టోలో రైతులకు రూ.12,500 ఇస్తామని ప్రకటించారని కన్నా లక్ష్మీ నారాయణ గుర్తు చేశారు . అయితే దాంట్లో మోదీ ప్రభుత్వం రైతులకు రూ.6వేలు ఇస్తున్న సంగతి మరిచిపోవద్దన్న కన్నా ఆ రూ.6 వేలు కలుపుకునే 'వైఎస్సార్ రైతు భరోసా'గా ఇస్తున్నారని చెప్పారు. ఆరు వేల రూపాయలు మోడీ సర్కార్ ఇస్తున్నప్పుడు , కేంద్రం రైతులకు ఇచ్చేదానిపై చంద్రబాబులాగా స్టిక్కర్ వెయ్యటం సమంజసం కాదని లాజిక్ మాట్లాడారు . అంతే కాదు వైఎస్ఆర్ రైతు భరోసా అని పేరు పెట్టటం కరెక్ట్ కాదని విమర్శించారు. 6 వేలు రైతులకు ఇస్తున్న మోడీ పేరు రైతు భరోసాకు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించటానికి జగన్ సర్కారు అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి, కౌలు రైతులతో సహా ఈ పథకం ద్వారా ఏటా రూ.12,500 పెట్టుబడి సాయం అందజేయనున్నారు. ఈ పథకానికి వైఎస్ఆర్ రైతు భరోసాగా నామకరణం చేసింది వైసీపీ సర్కార్ . రైతుపక్షపాతిగా పేరొందిన వైఎస్ పేరును ఈ పథకానికి పెట్టడం సరైందని అధికార పార్టీ నేతలు భావిస్తుంటే బీజేపీ మాత్రం ఈ పథకానికి మోదీ పేరు పెట్టాలన్న డిమాండ్ ను తెరమీదకు తెచ్చిందిఇక కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి విన్న వైసీపీ నేతలు అవాక్కయ్యారు. వైసీపీ అధికారంలో ఉంటె తమ నాయకుల పేరు , తమ పార్టీ పేరు కాకుండా బీజేపీ నేతల పేర్లు ఎలా పెడతామని మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోడీ పేరు రైతు భరోసా పథకానికి పెట్టాలని చెప్పటం దారుణం అని వారు అభిప్రాయపడుతున్నారు. . .