'కాబోయే సిఎం కన్నా': గుంటూరులో ఫ్లెక్సీ కలకలం
గుంటూరు/హైదరాబాద్: 'కాబోయే సిఎం కన్నా' అంటూ గుంటూరు జిల్లాలో ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. పట్టణంలో గురువారం ఓ ఫ్లెక్సీ వెలిసింది. అందులో కాబోయే ముఖ్యమంత్రి కన్నా అంటూ రాశారు. ఈ ఫ్లెక్సీని స్థానిక కాంగ్రెసు పార్టీ నాయకులు, మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ వర్గానికి చెందిన వారు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా కన్నా లక్ష్మీ నారాయణ సీమాంధ్ర ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల కన్నా లక్ష్మీనారాయణకు ఢిల్లీ పెద్దల నుండి పిలుపు రాగా ఆయన వెళ్లారు. అధినేత్రి సోనియా గాంధీతో ఆయన భేటీ అయ్యారు. సోనియాతో భేటీ అనంతరం కన్నా మాట్లాడుతూ.. తెలంగాణపై ఈ దశలో వెనక్కి పోయే పరిస్థితి లేదని అధినేత్రి తనతో చెప్పారన్నారు.
ఆయనకు పిలుపు రావడం, అధినేత్రితో భేటీ కావడంతో విభజన తర్వాత సీమాంధ్ర ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. దానిని కన్నా పలుమార్లు ఖండించారు. సోనియా భేటీ అనంతరం మాట్లాడిన ఆయన తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నాననే వార్తలు అవాస్తవమన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేందుకు కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. తనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి పిలుపు రాలేదని, తానే అపాయింటుమెంట్ తీసుకొని కలిశానని చెప్పారు.
ముఖ్యమంత్రి రేసు వార్తలను ఐదు రోజుల క్రితం కూడా ఆయన మరోసారి ఖండించారు. ముఖ్యమంత్రిని మారుస్తారనే వార్తలను తాను ఖండిస్తున్నానని, సిఎం మార్పు విషయంపై నిన్ననే ఖండించానని, ఇప్పుడు మళ్లీ ఖండిస్తున్నానన్నారు. తాను కేవలం కాంగ్రెసు పార్టీ కార్యకర్తగా సోనియాను కలిశానని వివరణ ఇచ్చారు. తాజాగా గుంటూరులో 'కాబోయే సిఎం కన్నా' ఫ్లెక్సీ వెలవడం గమనార్హం.