వాస్తవాలు చెప్తా, మోడీ వైపు ఏపీ నిలబడుతుంది: కన్నా, చంద్రబాబుకు చురకలు
అమరావతి: తనకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై పలు వర్గాలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. తనకు అన్ని సామాజిక వర్గాలు అండగా ఉంటాయనే నమ్మకం ఉందని చెప్పారు. రాజకీయ జీవితంలో తన గురించి తెలిసిన వారికి నా వ్యవహారశైలి తెలుసునని చెప్పారు.
నా అనుభవంతో పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని కన్నా చెప్పారు. బీజేపీపై రాష్ట్ర ప్రజలలో ఉన్న వ్యతిరేకతను తొలగిస్తామని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని, అందుకు మీడియా తమకు సహకరించాలన్నారు. కొందరు స్వార్థం కోసం బీజేపీపై నిందలు వేశారని పరోక్షంగా చంద్రబాబు, టీడీపీని ఉద్దేశించి అన్నారు.

సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తా
అధిష్టానం తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిందని, వీటిని సమర్థవంతంగా నిర్వహిస్తానని కన్నా చెప్పారు. పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తానని తెలిపారు. తమ పార్టీపై ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన దాడిని, నిందలను తుడిచి వేస్తామని ఆయన అన్నారు.

కేంద్రం చెప్పినవి, చెప్పనివి ఎన్నో చేసింది
ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదన్న ప్రచారాన్ని తిప్పికొడతామని కన్నా చెప్పారు. కేంద్రం చెప్పినవి, చేయనివి ఎన్నో కార్యక్రమాలు చేసిందని చెప్పారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా మద్దతిస్తారని భావిస్తున్నానని చెప్పారు. కేంద్రం ఇస్తామని చెప్పినా తీసుకోని విషయాలను ప్రజలకు తెలుపుతామన్నారు.

ఆ రోజు ఏపీ ప్రజలు మోడీ వైపు నిలబడతారు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాస్తవాలు తెలుసుకున్న రోజు ప్రధాని నరేంద్ర మోడీ వైపు నిలబడతారని కన్నా చెప్పారు. ప్రజలకు వాస్తవాలు వివరిస్తే వారు తమ వెంట వస్తారనే నమ్మకం తనకు గట్టిగా ఉందన్నారు. నేను 25 ఏళ్ల పాటు శాసన సభ్యుడిగా ఉన్నానని, తన రాజకీయ జీవితంలో కులం, మతం అనే బేధాలు కనిపించలేదని, ఇప్పుడు అదే నమ్మకంతో ముందుకు సాగుతామన్నారు.

కన్నాకు పదవితో అసంతృప్తి
కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ బీజేపీ చీఫ్ పదవి ఇవ్వడంతో సోము వీర్రాజు వర్గం అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజమండ్రి నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తూర్పు గోదావరి, రాజమండ్రి నగర అధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వరని రాజమండ్రి నేతలు ప్రశ్నించారు. మరో పార్టీ నుంచి వచ్చిన నాయకుడికి రాష్ట్ర బాధ్యతలు ఇవ్వడం సరికాదంటున్నారు. విజయవాడలో జరగనున్న 13 జిల్లాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications