అనంతపురంలో హైడ్రామా- మీడియాను ఏమార్చి..!!
Challenging Star Darshan: ప్రముఖ కన్నడ నటుడు, శాండిల్వుడ్ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీప కష్టాలు మరింత పెరిగాయి. హత్యకేసులో అరెస్టయిన ఆయన జైలులో రాజభోగాలను అనుభవిస్తోన్నారంటూ వచ్చిన ఆరోపణలు, తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటో, వీడియో కాల్ ఆయన కొంపముంచింది.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్.. ప్రధాన నిందితుడు. కన్నడ నటి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీలకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తుండేవాడనే కారణంతో రేణుకా స్వామిపై కక్ష పెంచుకుని సుపారీ ఇచ్చి అతణ్ని హత్య చేయించాడనే ఆరోపణలపై దర్శన్ అరెస్ట్ అయ్యారు.

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ జైలులో ఆయన రాజభోగాలను అనుభవిస్తోన్నారని, ఓ రిసార్టులో ఉన్నట్లుగా అన్నింటినీ సమకూర్చుకున్నాడనే విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ ఫొటో.. ఈ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించింది.
ఓ చేతిలో కాఫీ కప్, మరో చేతిలో సిగరెట్తో కనిపించాడు దర్శన్ ఈ ఫొటోలో. అతనితో పాటు మరో ముగ్గురు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ బేఫికర్గా ఉన్నట్లు తేలింది. తనకోసం ప్రత్యేకంగా ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నాడనే విమర్శలు చెలరేగాయి. అదే సమయంలో మార్కెట్ ధర్మ అనే ఓ రౌడీ షీటర్ కొడుకుతో వీడియో కాల్లో మాట్లాడటం కూడా కలకలం రేపింది.
ఈ పరిణామాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. సమగ్ర విచారణకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్కు ఆదేశించారు. దర్శన్ సహా అతనితో పాటు ఉన్న వారందరినీ కూడా వెంటనే వేర్వేరు జైళ్లకు తరలించాలని ఆదేశించారు.
దర్శన్తో పాటు ఇదే కేసులో అరెస్టయిన వారిని రాష్ట్రంలోని ఇతర జైళ్లకు తరలించేలా ఆదేశాలను ఇచ్చారు. దర్శన్ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే.. పవన్, రాఘవేంద్ర, నందీష్- మైసూరు, జగదీష్, లక్ష్మణ- శివమొగ్గ సెంట్రల్ జైలుకు తరలించాలంటూ ఆదేశాలొచ్చాయి.
ధన్రాజ్- ధార్వాడ, వినయ్- విజయపురా, నాగరాజ్- కలబురగి, ప్రదోష్- బెళగావి, రవి, కార్తీక్, నిఖిల్, కేశవమూర్తి- తుమకూరు సెంట్రల్ జైళ్లకు షిఫ్ట్ చేశారు. మిగిలిన అనుకుమార్, దీపక్ను ప్రస్తుతం ఉన్నచోటే అంటే బెంగళూరు పరప్పన అగ్రహార జైలులోనే కొనసాగించాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ పరిణామాల మధ్య దర్శన్.. కొద్దిసేపటి కిందటే బళ్లారి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. ఈ తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో ఆయనను బళ్లారికి తరలించే ప్రక్రియను పరప్పన అగ్రహార జైలు అధికారులు ప్రారంభించారు. మేఖ్రీ సర్కిల్, హెబ్బాళ, యలహంక- చిక్బళ్లాపుర, బాగేపల్లి, అనంతపురం, ఉరవకొండ మీదుగా బళ్లారికి తీసుకొచ్చారు.
ఈ విషయంలో మీడియాను ఏమార్చారు జైలు అధికారులు. తొలుత బెంగళూరు- తుమకూరు- శిరా- హిరియూరు- చెళ్లకెరె- మొలకల్మూరు- పరశురామ్పుర మీదుగా బళ్లారికి తరలిస్తామంటూ వెల్లడించారు. ఈ రూట్ మ్యాప్ ప్రకారం ఆయనను తీసుకెళ్లలేదు.
భద్రత కారణాలు, మీడియా హడావుడి నేపథ్యంలో రూట్ మ్యాప్లో చివరి నిమిషంలో మార్పులు చేశారు. చిక్బళ్లాపుర, బాగేపల్లి, అనంతపురం, ఉరవకొండ మీదుగా బళ్లారికి తీసుకొచ్చారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ భరత్ రెడ్డి సారథ్యంలో ఈ తరలింపు ప్రక్రియ ముగిసింది.












Click it and Unblock the Notifications