పవన్ ప్రశ్న, ముద్రగడ విమర్శలు: 'ఇదీ లెక్క, కాపులు ఎవరితో ఉన్నారో తేలిపోయింది?'
ఏపీలో కాపులు తమతోనే ఉన్నారని కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని టిడిపి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి: ఏపీలో కాపులు తమతోనే ఉన్నారని కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని టిడిపి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముగ్గురు ఇలా
కాపు రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ పద్మనాభం.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కూడా కాపులపై వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. మరోవైపు, కాపు రిజర్వేషన్లపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు.
కాపులు నమ్మడం లేదంటూ విమర్శలు
ఈ నేపథ్యంలో కాకినాడ ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు గెలవడంతో కాపులు తమ వైపే ఉన్నారని తెలుస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. ముద్రగడ, జగన్ మాటలను కాపులు నమ్మడం లేదంటున్నారు.
టిడిపికి కాపుల బ్రహ్మరథం
కాకినాడ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు టిడిపిని ఆదరించి ఘన విజయం కట్టబెట్టారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. ముఖ్యంగా కాపులు టిడిపికి బ్రహ్మరథం పట్టారన్నారు.
ఇదీ లెక్క
కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి తమ పార్టీ 15 వార్డుల్లో టిక్కెట్లిస్తే 12 చోట్ల గెలిచారని సోమిరెడ్డి చెప్పారు. వైసిపికి 21 మంది కాపులకు టిక్కెట్లిస్తే ఐదుగురు మాత్రమే గెలిచారన్నారు. 15 వార్డుల్లో టిడిపి, వైసిపిలనుంచి కాపు అభ్యర్థులే ముఖాముఖి పోటీ పడగా వాటిలో 12 చోట్ల టిడిపి అభ్యర్థులే గెలిచారన్నారు. కాపులు టిడిపితోనే ఉన్నారని స్పష్టంగా అర్ధమవుతోందన్నారు.