పవన్ కాన్వాయ్లో స్వల్ప ప్రమాదం: జనసేన చీఫ్కు బాబు మర్యాదలు అదిరిపోయాయ్!
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాన్వాయ్లో గురువారం ఉదయం స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. పలు అంశాల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో చర్చల కోసం ఆయన హైదరాబాదు నుంచి విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్లో స్వల్ప ప్రమాదం జరిగింది. గన్నవరం నుంచి కాన్వాయ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్తుండగా... ఓ అసుపత్రి సమీపంలో కాన్వాయ్ పైలట్ వాహనాన్ని మరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
రెండు గంటల వరకు భేటీ!
క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వస్తున్నాయని తెలుస్తోంది. వారి భేటీ మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగనుందని సమాచారం. అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్, భూసమీకరణ అంశాలతో పాటు సామాజిక వర్గాల అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల బిజెపి - టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అదే సమయంలో బిజెపి నేతలు పలువురు... చంద్రబాబు హయాంలో కాపులకు ప్రాధాన్యం లేదని ఆరోపిస్తున్నారు.
దీంతో పవన్, చంద్రబాబు భేటీలో కాపు సామాజిక వర్గం అంశం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. బిజెపి నేతల 'కాపు' అంశంపై పవన్కు చంద్రబాబు వివరణ ఇచ్చి ఉంటారని అంటున్నారు. ప్రధానంగా రాజధాని రైతుల, భూసమీకరణ అంశం చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఈ భేటీలో మంత్రి కామినేని శ్రీనివాస్ రావు, సిఆర్డీఏ కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్లు ఉన్నారు.
పవన్ కళ్యాణ్కు చంద్రబాబు మర్యాదలు
చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అతిథి మర్యాదలు అదిరిపోయాయి. క్యాంప్ ఆఫీసు వద్ద చంద్రబాబు వాహనం ఉండాల్సిన స్థలంలో పవన్ కళ్యాణ్ వాహనాన్ని పార్క్ చేయించారు. భేటీ అనంతరం పవన్ వెళ్లే సమయంలో.. కారు వరకు వచ్చి పవన్కు చంద్రబాబు వీడ్కోలు పలికారు.
సాధారణంగా చంద్రబాబు నుంచి ఈ స్థాయి ప్రాధాన్యత ఇతరులకు దక్కదని చెప్పవచ్చు. గత ఎన్నికల నాటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.