కాపు నేతల కీలక భేటీ - కొత్త వేదిక ఏర్పాటు : కొత్త సమీకరణాల దిశగా..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల లక్ష్యంగా సామాజిక వర్గాల పరంగా ప్రభావం చూపేందుకు సిద్దం అవుతున్నారు. గతంలో హైదరాబాద్ లో రెండు సార్లు సమావేశమైన కాపు నేతలు ఈ సారి విశాఖలో భేటీ అయ్యారు. పార్టీలు - రాజకీయాలకు అతీతంగా సమావేశం నిర్వహించారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కాపు వర్గానికి ప్రాధాన్యత దక్కేలా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. ఆ సమావేశంలోనే కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ప్రతిపాదనలు వచ్చినట్లుగా సమాచారం.
వ్యూహాత్మకంగా ముందుకు
అయితే, కాపు వర్గానికి చెందిన పార్టీగా ముందకొస్తే..ఇతర వర్గాలు సహకరించే అంశం పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అందరినీ కలుపుకు పోతేనే రాజకీయంగా మనుగడ ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. అయితే, ఏపీలో రాజకీయ పరిణామాల పైన చర్చించినట్లుగా సమాచారం. వైసీపీకి చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరు కాలేదని చెబుతున్నారు. గంటా శ్రీనివాస రావు... వట్టి వసంతకుమార్.. బోండా ఉమా.. మాజీ డీజీపీ సాంబశివరావు తో పాటుగా పలువురు కాపు ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయంగా భవిష్యత్ లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా..ముందుగా అందరిలో తమ పైన భరోసా కల్పించే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చారు.
కొత్త వేదిక ద్వారా కీలక భూమిక
అందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ పేరుతో ఒక సంస్థ కు ఖరారు చేసారు. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు దీనికి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. భవిష్యత్ లో రాజకీయ అజెండా తీసుకునే అవకాశం ఉందని, ఉత్తరాదిలో సామాజిక వర్గాల మధ్య జరిగిన కూర్పు లాంటి ప్రయోగంగా దీన్ని భావించవచ్చు అన్నారు. రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాపు రిజర్వేషన్లు కంటే ఆర్ధిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలే కీలకమని అభిప్రాయపడ్డారు.
సోషల్ ఇంజనీరింగ్ పై ఫోకస్
బహుజన,కాపు, అగ్రవర్ణ పేదల కలయికతో కొత్త సమీకరణాల దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఏపీలో కొత్త రాజకీయాలకు కావాల్సిన పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని నేతలు చెబుతున్నారు. త్వరలోనే ఫోరం ఫర్ బెటర్ ఏపీ తన కార్యాచరణను ప్రకటించే అవకాశం వుంది. దీంతో..కాపు నేతల భవిష్యత్ అడుగులు.. రాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ పైన ప్రభావం చూపుతాయి.. రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా మారుస్తాయనేది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.