మాకు సత్తా ఉంది.. రిజర్వేషన్ వద్దు, 2 ఉద్యోగాలు పొందా: కాపు వ్యక్తి పోస్ట్, ప్రశ్నలు
విజయవాడ: ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. తమను బీసీల్లో చేర్చాలని, తమకు రిజర్వేషన్లు కల్పించాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు కాపుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. ఇది చర్చకు దారి తీసింది. ఆ పోస్ట్ చేసిన వ్యక్తి.. తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడినని చెబుతూ తమకు సత్తా ఉందని, తమకు రిజర్వేషన్లు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
అతను చేసిన పోస్ట్ ప్రకారం... 'నేను కాపు సామాజిక వర్గానికి చెందినవాడిని. మెరిట్ ద్వారా నేను రెండు ఉద్యోగాలు పొందాను. మాకు మా ప్రతిభ పైన నమ్మకం ఉంది. మాకు అత్యాశ లేదు. మేం రిజర్వేన్ల కోసం డిమాండ్ చేయవలసిన అవసరం లేదు. నా పిల్లలు కూడా రిజర్వేషన్ కోరుకోర'ని పోస్ట్ చేశాడు.
దీనిని పోస్ట్ చేసింది మహేష్ అనే వ్యక్తిగా తెలుస్తోంది. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. అతను పెట్టిన గంటల్లోనే దానిని వందలాది మంది షేర్ చేశారు.
మహేష్ చేసిన ఫేస్బుక్ పోస్ట్లో... తాను రెండు సార్లు ప్రభుత్వ ఉద్యోగం పొందానని, 1995లో, 1998లో రెండుసార్లు ప్రతిభ ద్వారా ఉద్యోగం సంపాదించానని చెప్పారు. అతను తన తొలి ఉద్యోగం తిరుపతిలోని ఎస్వీఐఎంఎస్లో డయాలసిస్ థెరపిస్ట్గా పొందారు.
ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో 140వ ర్యాంక్ సంపాదించాడు. స్పెషల్ గ్రేడ్ టీచర్ అయ్యాడు. దీనిపై జగదీష్ అనే వ్యక్తి స్పందించాడు. మీరు మంచి ముందడుగేశారని, బాగా చెప్పారంటూ... 140వ ర్యాంక్ వచ్చిన మీకు ఉద్యోగం వచ్చిందని, 141వ ర్యాంక్ వచ్చిన మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఉద్యోగం రాలేదని, అందుకు కోటా అయిపోవడమేనని పేర్కొన్నాడు.
అదే సమయంలో రిజర్వేషన్ కేటగిరీలో 250వ ర్యాంక్ వరకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పాడు. ఇది ఏం సమానత్వం అని ప్రశ్నించాడు. 141వ ర్యాంక్ వస్తే ఉద్యోగానికి అర్హులు కాదా అని ప్రశ్నించాడు. దీనికి మీరు స్పందించాలని అన్నాడు.